దూకుడు పెంచిన కిషన్‌రెడ్డి.. అసలు వ్యూహమేంటి?

ABN , First Publish Date - 2020-02-22T17:36:15+05:30 IST

దూకుడు పెంచిన కిషన్‌రెడ్డి.. అసలు వ్యూహమేంటి?

దూకుడు పెంచిన కిషన్‌రెడ్డి.. అసలు వ్యూహమేంటి?

ప్రశాంతతకు ఆయన మారు పేరు‌‌‌. తన పని తాను చేసుకుపోతూ.. చాపకింద నీరులా వ్యవహారాన్ని చక్కబెడుతుంటారు. అలాంటి నేత ఇటీవల ఒక్కసారిగా దూకుడు పెంచారు! ఇంతకీ ఆయన వ్యవహారశైలి ఎందుకు మార్చుకున్నారు?దూకుడు వెనకున్న వ్యూహమేంటి? ఇందులో పార్టీ హైకమాండ్‌ పాత్ర ఎంత? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో తెలుసుకోండి.

 

  నిండు కుండ తొణకదు అంటారే అలాగే ఉండేది బీజేపీ నేత కిషన్‌రెడ్డి వ్యవహారశైలి. బీజేపీ యువమోర్చా జాతీయ నాయకుడిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనది. కిషన్‌రెడ్డి ఏ పదవిలో ఉన్నా ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతుంటారనే పేరుంది. ఎమ్మెల్యేగా‌.. శాసనసభాపక్ష నేతగా ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ, తెలంగాణ శాసనసభలలో కిషన్‌రెడ్డి ప్రత్యేక ముద్ర వేశారు. అసెంబ్లీలో ఎవరిపైనా వ్యక్తిగతంగా ఆయన విమర్శలు గుప్పించిన దాఖలాలు లేవు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కిషన్‌రెడ్డి గెలిచారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయకు మోదీ అవకాశం కల్పించారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ కిషన్‌రెడ్డి ఢిల్లీ, హైదరాబాద్‌లలో బిజీబిజీగా గుడుపుతున్నారు. 


  అయితే ప్రశాంతతకు మారుపేరైన కిషన్‌రెడ్డి ఇటీవల దూకుడు పెంచారన్న టాక్‌ వినిపిస్తోంది. నాంపల్లి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోనూ ఈ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కిషన్‌రెడ్డి వారంలో నాలుగైదు రోజులు ఢిల్లీలో ఉంటున్నారు. రెండు లేదా మూడు రోజులపాటు హైదరాబాద్‌లో మకాం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఢిల్లీలో శాఖాపరమైన పనులను చూసుకోవటం.. హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల పనులను చక్కబెట్టడం తన విధులుగా మార్చుకున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు, భైంసా సంఘటన జరిగినప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఉండి కూడా కిషన్‌రెడ్డి అంత చొరవ తీసుకోలేదన్న విమర్శలొచ్చాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నా చేస్తోన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై దాడి జరిగినప్పుడు కూడా కేంద్రమంత్రి హోదాలో కిషన్‌రెడ్డి గట్టిగా స్పందించలేదని స్వపక్ష నేతలే పెదవులు విరిచారు. అదే విధంగా భైంసాలో దాడులు జరిగిన వెంటనే కేంద్రమంత్రి హోదాలో కిషన్‌రెడ్డి అక్కడ పర్యటించి ఉంటే.. బాధితులకు బాసటగా ఉండేదని కాషాయ పార్టీ కార్యకర్తలు ఫీలయ్యారు. 


 ఈ విషయాన్ని అవగతం చేసుకున్నారో ఏమో.. ఈ మధ్య కాలంలో "మిస్టర్‌ కూల్‌ కిషన్‌రెడ్డి'' బాగా దూకుడు పెంచారట. ప్రజాసమస్యల పరిష్కారంలో చురుకు ప్రదర్శిస్తున్నారట. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా తన పరిధిని, బాధ్యతలను అర్థంచేసుకోవటానికే కొంత సమయం తీసుకున్నారట. పార్లమెంట్‌లో వివిధ బిల్లులను ప్రవేశపెట్టడం, ఎంపీల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి బాధ్యతలు కూడా తనపై ఉండటంతో.. శాఖాపరమైన విషయాలను బాగా అవగతం చేసుకున్నారట! తన శాఖపై పట్టు కుదురుకున్నాక.. ఆయన తన శైలిని మార్చేశారు. వరుసగా ఫీల్డ్ విజిట్స్ చేస్తూ అధికారులకు చెమటలు పట్టిస్తున్నారు. మూడో దశ మెట్రోరైల్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించకపోవటంతో సంబంధిత అధికారులకు కిషన్‌రెడ్డి క్లాస్ పీకారు. తర్వాత మెట్రో పనితీరుపై అధికారులతో కలసి కేంద్రమంత్రి ఫీల్డ్ విజిట్ చేశారు. అక్కడితో ఆగకుండా భైంసాలో కేంద్రమంత్రి హోదాలో పర్యటించారు. భైంసా బాధితులను పరామర్శించి.. జిల్లా ఉన్నతాధికారులను జరిగిన ఘటనపై వివరణ కోరారు. తద్వారా బాధితులకు అండగా ఉంటామని స్పష్టమైన సంకేతాలిచ్చారు. తమ నాయకుడు కిషన్‌రెడ్డి ఈ స్థాయిలో దూకుడు పెంచటంతో  బీజేపీ కార్యకర్తల్లో జోష్‌ వచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కిషన్‌రెడ్డి ఇదే శైలిని ఇకముందు కూడా కొనసాగించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Updated Date - 2020-02-22T17:36:15+05:30 IST