పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

ABN , First Publish Date - 2020-10-07T18:32:42+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శాంతి భద్రతలపై విస్తృతస్థాయి సమీక్ష చేస్తున్నారు. ఈ సమావేశంలో డీజీపీ, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు. తెలంగాణలో మావోయిస్టుల కదలికలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.


మరోవైపు మహిళల భద్రత, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఇటీవల కాలంలో పొరుగు రాష్ట్రాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు ప్రవేశించారనే వార్తలు వెలువడుతున్నాయి. స్వయంగా కేంద్ర ఇంటిలిజెంట్ వర్గాలే రాష్ట్ర ప్రభుత్వానికి మావోయిస్టుల కదలికలపై సమాచారాన్ని అందించాయి.


నెలన్నర వ్యవధిలో తెలంగాణలో ఐదు ఎన్ కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. దీంతో తెలంగాణలో మావోయిస్టుల కదలికలు నిజమేనని ప్రభుత్వం నమ్ముతోంది. ఈ నేపథ్యంలో మన్యంలో పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలు, అడవుల్లో గాలింపు, తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టు నేతలు, మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితి... ఇలా అన్ని అంశాలపై అధికారులతో సీఎం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 


మావోయిస్టుల్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఇటీవల జరిగిన కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్‌కుమార్‌, ఛత్తీస్‌గఢ్‌, సీఆర్‌పీఎస్‌, బీఎస్‌ఎఫ్‌ తదితర విభాగాల అధికారులతో జరిగిన సమావేశం తీసుకున్న నిర్ణయాలు, అనుసరించాల్సిన విధానాలపైనా సీఎం చర్చలు జరిపి.. పోలీసు శాఖకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. 

Updated Date - 2020-10-07T18:32:42+05:30 IST