కేసీఆర్కు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది: వంశీచంద్రెడ్డి
ABN , First Publish Date - 2020-10-01T20:28:03+05:30 IST
నీళ్లు, నిధులు, నియామకాలు మీద ఏర్పడిన తెలంగాణలో అవేవి నేరవేరడం లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి తప్పుబట్టారు.
హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలు మీద ఏర్పడిన తెలంగాణలో అవేవి నేరవేరడం లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి తప్పుబట్టారు. ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగులకు నిరాశ ఏర్పడిందన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, కరోనా విషయంలో సర్కారు పూర్తి వైఫల్యం చెందిందని మండిపడ్డారు. పేదవారు సర్కారు దావఖానకు వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్తో దోచుకుంటోందని వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు ప్రక్రియ ప్రారంభమైందని, పట్టభద్రులు ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు.
ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, 2.70 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్న భర్తీ చేయడంలేదని దుయ్యబట్టారు. 6 ఏళ్లలో కేవలం 30వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని తప్పుబట్టారు. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానంపై టీఆర్ఎస్ వైఖరిని స్పష్టం చేయాలని, తక్షణమే ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం కోసం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు.