ప్రజలను కేసీఆర్ తప్పుదోవపట్టిస్తున్నారు
ABN , First Publish Date - 2020-03-19T09:47:04+05:30 IST
మజ్లిస్ పార్టీ నేతల మెప్పుకోసం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదింపజేశారని బీజేపీ రాష్ట్ర నేతలు అన్నారు. ఆయన ప్రజలను
![ప్రజలను కేసీఆర్ తప్పుదోవపట్టిస్తున్నారు](https://media.andhrajyothy.com/appimg/galleries/202003190319855/03192020041645n87.jpg)
సీఏఏ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలి
గవర్నర్ తమిళిసైకి బీజేపీ రాష్ట్ర నేతల ఫిర్యాదు
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మజ్లిస్ పార్టీ నేతల మెప్పుకోసం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదింపజేశారని బీజేపీ రాష్ట్ర నేతలు అన్నారు. ఆయన ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను బీజేపీ నేతలు లక్ష్మణ్, ఎన్.రామచందర్రావు, డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు, వివేక్, రామచంద్రారెడ్డి కలిసి, ఫిర్యాదు చేశారు. సీఏఏ, ఎన్పీఆర్పై అపోహలు సృష్టించి కేసీఆర్ గందరగోళానికి తెరలేపారని వారు విమర్శించారు. చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడం అంటే భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను అవమానించడమేనన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఏఏ, ఎన్పీఆర్ తీర్మానాలను ఉపసంహరించుకునేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ఎన్పీఆర్ ప్రక్రియ జరపడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. కేసీఆర్ తక్షణం రాష్ట్ర పజలకు క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి శరణార్థిగా వచ్చిన తస్లీమాపై దాడికి పాల్పడిన మజ్లిస్ నాయకులు సీఏఏను వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు.