28న కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష పెళ్లి

ABN , First Publish Date - 2020-12-26T07:59:24+05:30 IST

సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం డిసెంబరు 28న జరగనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల పంచాయతీలోని పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో సోమవారం ఉదయం 10 గంటలకు వివాహం జరగనుంది

28న కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష పెళ్లి

లూర్దునగర్‌ చర్చిలో వివాహం.. స్ర్తీ శిశు సంక్షేమశాఖ ఏర్పాట్లు


కేశంపేట, డిసెంబరు 25: సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం డిసెంబరు 28న జరగనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల పంచాయతీలోని పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో సోమవారం ఉదయం 10 గంటలకు వివాహం జరగనుంది. పెళ్లి ఏర్పాట్లను స్ర్తీ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తోంది. హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన ఉడుముల జైన్‌మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తారు. వీరి నిశ్చితార్థం అక్టోబరులో విద్యానగర్‌లోని ఓ హోటల్‌ జరిగింది. ప్రత్యూష కుటుంబంతో తమకు చుట్టరికం కూడా ఉందని చరణ్‌రెడ్డి బంధువులు తెలిపారు. చరణ్‌రెడ్డి అమ్మమ్మ గ్రామం పాటిగడ్డ కావడంతో ఇక్కడ వివాహం చేస్తున్నారు. డిసెంబరు 27న బేగంపేట ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రాంగణంలో ప్రధానం నిర్వహించి, 28న వివాహం జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానం కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు ప్రభుత్వ అధికారులు హాజరవుతారని వరుడి బంధువులు తెలిపారు.

Updated Date - 2020-12-26T07:59:24+05:30 IST