ఆర్టీసీ అధికారుల్లో తీవ్ర నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2020-03-13T09:42:56+05:30 IST
సీఎం కేసీఆర్ ఆలోచనలకు, లక్ష్యానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు నడుచుకోవడం లేదని, కొందరు ఉన్నతాధికారులు కార్మికులను బానిసలుగా చూస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు.

కార్మికుల్ని బానిసలుగా చూస్తున్నారు
మండలిలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
హైదరాబాద్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ ఆలోచనలకు, లక్ష్యానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు నడుచుకోవడం లేదని, కొందరు ఉన్నతాధికారులు కార్మికులను బానిసలుగా చూస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ఇటీవలే 25 మంది కార్మికులను కక్షపూరితంగా తొలగించారన్నారు. దీనిపై మాట్లాడేందుకు తానే స్వయంగా ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)కు ఏకంగా 25సార్లు ఫోన్ చేసినా స్పందన లేదని, చివరికి తాను ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్నంటూ మెసేజ్ చేసినా స్పందించలేదన్నారు. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి దృష్టి పెట్టాలని కోరారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్ అడిన ప్రశ్నలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమాధానం చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారుల తీరు మార్చాకోవాలని తానే స్వయంగా వారికి సూచించినట్లు మంత్రి తెలిపారు. ఇకపై ఏ ప్రజాప్రతినిధి ఫోన్ చేసినా స్పందించే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.