ప్రజల గుండెల్లో నిలిచిన జర్నలిస్టు చంద్రమౌళి
ABN , First Publish Date - 2020-12-21T04:32:20+05:30 IST
ప్రజల గుండెల్లో నిలిచిన జర్నలిస్టు చంద్రమౌళి

మహబూబాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ సమస్యలను వెలికితీసి పరిష్కారంలో ముందున్న జర్నలిస్టు ఎడమ చంద్రమౌళి ప్రజల గుండెల్లో నిలిచారని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు. గార్ల మండల కేంద్రంలో ఆదివారం జర్నలిస్టు చంద్రమౌళి సంతాప సభను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. అనునిత్యం ప్రజాసమస్యలపై దృష్టిసారించి, తన కలం ద్వారా గళాన్ని వినిపించి పరిష్కారానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి చంద్రమౌళి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. చంద్రమౌళి కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఝాన్సీ, ఎంపీపీ మూడు శివాజీచౌహాన్, సర్పంచ్ అజ్మీర భన్సీలాల్, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్య నాగేశ్వర్రావు, నేతలు కట్టెబోయిన శ్రీనివాస్, గిరిప్రసాద్, శక్రు, జర్నలిస్టులు కొత్త వెంకన్న, బుడాన్ పాల్గొన్నారు.