వరుసగా జేఈఈ, ఎంసెట్‌ ఫలితాలు

ABN , First Publish Date - 2020-10-01T07:42:44+05:30 IST

జేఈఈ, ఎంసెట్‌ ఫలితాలు వరుసగా విడుదల కానున్నాయి. సెప్టెంబరు 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పూర్తయిన విషయం తెలిసిందే. దీని ఫలితాలను అక్టోబరు-6న విడుదల...

వరుసగా జేఈఈ, ఎంసెట్‌ ఫలితాలు

6, 10 తేదీల్లో ఎంసెట్‌ ఫలితాలు.. 3 విడతల్లో కౌన్సెలింగ్‌ 


హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జేఈఈ, ఎంసెట్‌ ఫలితాలు వరుసగా విడుదల కానున్నాయి. సెప్టెంబరు 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పూర్తయిన విషయం తెలిసిందే. దీని ఫలితాలను అక్టోబరు-6న విడుదల చేయనున్నారు. 5న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు ప్రకటించనున్నారు. అలాగే ఎంసెట్‌ అగ్రికల్చర్‌, వెటర్నరీ ఫలితాలను ఈనెల 10న ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా, ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను జేఈఈ కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. జేఈఈ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ఈనెల 6న ప్రారంభం కానుంది. మొత్తం 6 విడతల్లో జరగనున్న కౌన్సెలింగ్‌ నవంబరు-9న ముగియనుంది. దీంతో ఎంసెట్‌ ఫలితాలు ముందుగానే ప్రకటించినా.. కౌన్సెలింగ్‌ మాత్రం జేఈఈ ప్రక్రియ  ముగిసిన తర్వాతనే చేపట్టనుంది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను మూడు దశల్లో నిర్వహించనున్నామని, నవంబరు మొదటివారంలో తొలిదశ కౌన్సెలింగ్‌ పూర్తిచేసి నవంబరు ఆఖరులోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తామని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. అలాగే ఎంసెట్‌ అగ్రికల్చర్‌, వెటర్నరీ పరీక్షలకు హాజరైనవారిలో అత్యధికులు నీట్‌ పరీక్ష కూడా రాస్తారు. దీంతో నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరమే ఎంసెట్‌ అగ్రికల్చర్‌, వెటర్నరీ కౌన్సెలింగ్‌ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.  

Updated Date - 2020-10-01T07:42:44+05:30 IST