ఇరిగేషన్ పునర్వ్యవస్థీకరణ!
ABN , First Publish Date - 2020-02-20T10:20:04+05:30 IST
ఇరిగేషన్ శాఖను పునర్ వ్యవస్థీకరించారు. పరిపాలన, ప్రాజెక్టులను వేర్వేరుగా చూడాలని నిర్ణయించారు. పరిపాలన విభాగంలో పనిచేసే
- ఇకపై పరిపాలన, ప్రాజెక్టులు వేర్వేరు
- మేజర్ ఇరిగేషన్లోకి మైనర్ ఇరిగేషన్
- ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ఇరిగేషన్ శాఖను పునర్ వ్యవస్థీకరించారు. పరిపాలన, ప్రాజెక్టులను వేర్వేరుగా చూడాలని నిర్ణయించారు. పరిపాలన విభాగంలో పనిచేసే ఇంజనీర్లకు ప్రాజెక్టులకు సంబంధించిన బాధ్యతలను అప్పగించకూడదని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మార్పులు చేర్పులకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదించినట్లు సమాచారం.దీంతో త్వరలోనే ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం సాగునీటి శాఖలో ఉన్న విధానంలో మార్పులను చేయాలని సీఎం కేసీఆర్ ఇంతకు ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అఽధికారు లు కొంత కాలంగా కసరత్తును చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్, మేజర్ ఇరిగేషన్ వ్యవస్థలన్నీంటిని ఒక గొడుగు కిందకు తేవాలని నిర్ణయించారు. అలాగే, ఆయా ప్రాంతాల్లోని అన్ని ప్రాజెక్టులను ఒకే ఈసీ పరిధిలోకి చేర్చాలని నిర్ణయించారు. అందులో భాగంగా పలు ప్రతిపాదనలను అధికారులు రూపొందించారు. అయితే పరిపాలన విభాగంలో పనిచేసే అధికారులకూ కొన్ని ప్రాజెక్టుల బాధ్యతలను ఇవ్వాలని ఇంతకు ముందు ప్రతిపాదించారు. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది. అయితే...ఇందుకు సీఎం అంగీకరించకపోవడంతో అధికారులు మ ళ్లీ ప్రతిపాదనలను రూపొందించి సీఎం ఆమోదానికి పంపారు. ఈ తాజా ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. తాజా ప్రతిపాదన ప్రకారం.. పరిపాలన విభాగంలో పనిచేసే ఇంజనీర్లకు ఇక నుంచి ప్రాజెక్టులకు సంబంధించిన బాధ్యతలు ఉండవు. ఇక నుంచి మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ఉండదు. ఈ మైనర్ ఇరిగేషన్ను కూడా మేజర్లో కలిపివేశారు. ఇప్పటి వరకు మైనర్ ఇరిగేషన్ విభాగంలో పనిచేస్తున్న ఇంజనీర్లు త్వరలోనే మేజర్లోకి మారనున్నారు. అయితే....అంతరాష్ట్ర విభాగానికి ప్రత్యేక అధికారులు కొనసాగనున్నారు. సీవోటీ విభాగానికి కూడా ప్రత్యేక అధికారులు ఉంటారు. ప్రస్తుతం పరిపాలన విభాగం ఈఎన్సీ పరిధిలో కొన్ని ప్రాజెక్టులున్నాయి. త్వ రలోనే ఈ విభాగం నుంచి సద రు ప్రాజెక్టులకు సంబంఽధించిన బాధ్యతలను తొలగించి వాటిని ఆయా ప్రాంత సీఈల పరిధిలోకి తీసుకురానున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ఇరిగేషన్ విభాగానికి సంబంధించిన సర్కిల్స్, డివిజన్లను కూడా పునర్ వ్యవస్థీకరించనున్నారు. ప్రస్తుతం ఈఎన్సీలు, సీఈల వరకు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. త్వరలోనే ఎస్ఈల నుంచి కింది స్థాయి ఇంజనీర్ల వరకు ఈ పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయనున్నారు.
కాళేశ్వరానికి ఇద్దరు ఈఎన్సీలు
ముఖ్యమంత్రి ఆమోదించిన తాజా ప్రతిపాదనల ప్రకారం.....కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇద్దరు ఈఎన్సీలు ఉంటారు. ఒక ఈఎన్సీ పరిధిలో మేడిగడ్డ నుంచి ప్యాకేజీ-8 పంపుల వరకు ఉంటుంది. కరీంనగర్ కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది. రెండవ ఈఎన్సీ పరిధిలో మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు, అలాగే కొండపోచమ్మ, గందమల, బస్వాపూర్ రిజర్వాయర్ల వరకు ఉంటుంది. అలాగే మెదక్ మైనర్ ఇరిగషన్ను కూడా ఈ ఈఎన్సీ పరిధిలోకి తీసుకువచ్చారు. అలాగే....ఎస్సారెస్పీ సీఈ పరిధిలో శ్రీరాంసాగర్ నుంచి ఎల్ఎండీ వరకు, కడెం, సదర్మట్, ఎఫ్ఎ్ఫసీలను చేర్చారు. కరీంనగర్ సీఈ పరిధిలో ఎస్సారెస్పీకి చెందిన లోయర్మానేరు నుంచి నల్లగొండ, ఖమ్మం ఆయకట్టు ఎల్లంపల్ల, మిడ్మానేరులను చేర్చారు. గోదావరి బేసిన్ కమిషనర్ పరిధిలో ఉమ్మడి నిజాంసాగర్ ప్రాజెక్టులు, ఆయకట్టును చేర్చారు. గోదావరి లిఫ్టు ఇరిగేషన్ సీఈ పరిధిలోకి దేవాదుల, వరంగల్లోని ఇతర ఆయకట్టు ప్రాంతాలను చేర్చారు. ఖమ్మం సీఈ పరిధిలోకి సీతారామ, దుమ్ముగూడెం, పాలేరు దిగువ ఉన్న సాగర్ ఆయకట్టు, భక్తరామదాసు ప్రాజెక్టులను చేర్చారు. ఆదిలాబాద్ సీఈ పరిధిలోకి ప్రాణహిత, చనక-కోరట, పెన్గంగ, కుప్టి, కొమురంబీం వంటి ప్రాజెక్టులను తీసుకువచ్చారు. మహబూబ్నగర్ సీఈ పరిధిలోకి జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులను చేర్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రత్యేక సీఈ పోస్టును కేటాయించారు. నల్లగొండ సీఈ పరిధిలోకి పాలేరుకు ఎగువన ఉన్న సాగర్ ఆయకట్టు, ఏఎమ్మార్పీ, డిండి వంటి ప్రాజెక్టుల ఆయకట్టును చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పంప్హౌజ్ల్లోని విద్యుత్ మోటార్ల కోసం ప్రత్యేకంగా సీఈ పోస్టును సృష్టించారు.