‘స్టాఫ్‌నర్స్‌’ వెయిటేజీ మార్కుల్లో అక్రమాలు

ABN , First Publish Date - 2020-11-13T09:04:28+05:30 IST

స్టాఫ్‌నర్స్‌ పోస్టుల సర్వీస్‌ వెయిటేజీ మార్కుల్లో అక్రమాలు జరిగాయని, దాదాపు 300 మందికిపైగా అభ్యర్థులకు అర్హతలేకున్నా దొడ్డిదారిన వెద్య

‘స్టాఫ్‌నర్స్‌’ వెయిటేజీ మార్కుల్లో అక్రమాలు

300 మందికిపైగా దొడ్డిదారిన మార్కులు

టీఎస్‌పీఎస్సీకి పలువురి ఫిర్యాదు

 ధ్రువపత్రాల పరిశీలన వాయిదా


హైదరాబాద్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): స్టాఫ్‌నర్స్‌ పోస్టుల సర్వీస్‌ వెయిటేజీ మార్కుల్లో అక్రమాలు జరిగాయని,  దాదాపు 300 మందికిపైగా అభ్యర్థులకు అర్హతలేకున్నా దొడ్డిదారిన వెద్య ఆరోగ్యశాఖ అధికారులు మార్కులిచ్చారని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ అక్రమాలపై పలువురు అభ్యర్థులతోపాటు నర్సింగ్‌ ఔట్‌సోర్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు టీఎ్‌సపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. వైద్య ఆరోగ్యశాఖ పంపిన మార్కుల జాబితాలో అక్రమాలు జరిగాయని, ఇప్పటికే ప్రకటించిన మెరిట్‌ జాబితాను ఉపసంహరించాలని కోరారు. ఆ తర్వాతే అర్హుల కొత్త జాబితాను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.


మెరిట్‌జాబితా మారే అవకాశం: టీఎ్‌సపీఎస్సీ

వెయిటేజీ మార్కులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన టీఎ్‌సపీఎస్సీ.. వాటిని వైద్య ఆరోగ్యశాఖకు పంపించింది. మెరిట్‌ జాబితా మారే అవకాశముందని టీఎ్‌సపీఎస్సీ గురువారం ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈ నెల 19వరకు ఆన్‌లైన్‌లో కొనసాగనున్న ధ్రువపత్రాల పరిశీలనను వాయిదావేస్తున్నట్లు తెలిపింది. వైద్యఆరోగ్య శాఖ నుంచి స్పష్టత వచ్చిన తర్వాత సవరించిన మెరిట్‌జాబితాను ప్రకటిస్తామని వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలన కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామంది.


Updated Date - 2020-11-13T09:04:28+05:30 IST