కోవిడ్ టెస్ట్ల సంఖ్య పెంచాలి: మంత్రి ఈటల
ABN , First Publish Date - 2020-06-23T20:18:12+05:30 IST
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం 18 ల్యాబ్లకు ప్రైవేట్ అనుమతులు ఇచ్చింది.

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం 18 ల్యాబ్లకు ప్రైవేట్ అనుమతులు ఇచ్చింది. రూ. 2,200కు టెస్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ రూ. 4వేలు వసూలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్రశ్రీ ట్రస్ట్ ఆఫీసులో ప్రైవేట్ ల్యాబ్ల అసోసియేషన్ నేతలతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని సూచించారు. అయితే కోవిడ్ టెస్ట్ల ధరలు పెంచమని అసోసియేషన్ నేతలు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత గంభీరమైన పరిస్థితుల్లో కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడవద్దని, సాధారణ పరీక్షలకు కోవిద్ పరీక్షలకు చాలా తేడా ఉందని మంత్రి అన్నారు. ఇక్కడ సేర్వెలేన్స్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాలు ఇమిడి ఉన్నాయన్నారు. పాజిటివ్ వచ్చిన ప్రతి పేషంట్ వివరాలు వెబ్పైట్లో అప్లోడ్ చెయ్యాలని, అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలని సూచించారు. పరీక్షకు వచ్చిన ప్రతి ఒక్కరి రిజల్స్ వచ్చే వరకు ఇసొలేషన్లో ఉండాలని సూచించమని చెప్పారు. విమాన ప్రయాణీకులకు లక్షణాలు లేకపోయినా కరోనా పరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చుకోవచ్చన్నారు. పరీక్షలు చేస్తున్న లాబ్ టెక్నీషియన్లకు పూర్తి స్థాయిలో పీపీఈ కిట్స్ ఉపయోగించేలా చూడాలని..లేదంటే వారికి కరోనా సోకవచ్చునని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటలతోపాటు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.