పాలమూరు ఎత్తిపోతల పనులపై పొంతన లేని సమాధానాలు
ABN , First Publish Date - 2020-08-01T07:26:33+05:30 IST
పాలమూరు ఎత్తిపోతల పనులపై పొంతన లేని సమాధానాలు

నాగర్కర్నూల్/ఆమనగల్లు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ) పథకం పనుల పరిశీలనలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రశ్నలకు నీటిపారుదల శాఖ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. దీంతో ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివా్సగౌడ్, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు శుక్రవారం నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్, తీగలపల్లిలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. నార్లాపూర్లో రిజర్వాయర్ పనులు, ఆమోదం పొందిన డిజైన్లు, రిజర్వాయర్ ఎత్తు, పంపుహౌజ్లో బిగించబోయే మోటార్ల సంఖ్యపై ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఉన్నతాధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పారు. నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద మట్టి లభ్యత లేకపోవడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని పీఆర్ఎల్ఐ ముఖ్య అధికారి ఒకరు మంత్రులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తీవ్రంగా స్పందించారు. మట్టి దొరకదనే నెపంతో రైతుల నోట్లో మట్టి కొట్టొద్దని అన్నారు. అధికారులు సరైన సమాధానాలు చెప్పకపోవడం పట్ల ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రజత్కుమార్ కూడా అసహనం వ్యక్తం చేశారు.