ఉల్లి నిల్వలపై పరిమితి విధింపు
ABN , First Publish Date - 2020-12-10T07:24:18+05:30 IST
ఉల్లి ధరలు అదపు తప్పి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిమితులు విధించింది. టోకు వ్యాపారి 25 టన్నులు, చిల్లర వ్యాపారి రెండు టన్నుల వరకు మాత్రమే

టోకు వ్యాపారికి 25 టన్నులు
చిల్లర వ్యాపారికి రెండు టన్నులు
ఈ నెల 31 వరకూ నియంత్రణ
ధరను అదుపులోకి తెచ్చేందుకే!
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉల్లి ధరలు అదపు తప్పి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిమితులు విధించింది. టోకు వ్యాపారి 25 టన్నులు, చిల్లర వ్యాపారి రెండు టన్నుల వరకు మాత్రమే నిల్వచేసుకోవాలని నియంత్రణ విధిస్తూ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. లైసెన్సు- స్టోరేజీ ఆర్డర్- 2016 గతంలో ఉన్నప్పటికీ దానిని నిలుపుదల చేశారు. దాని సవరణకు సంబంధించిన నోటిఫికేషన్పై కేంద్ర చట్టానికి అనుగుణంగా బుధవారం జీవోను జారీ చేశారు. అసాధారణంగా ఉల్లిగడ్డ ధరలు పెరగటం, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో.. మార్కెట్ను క్రమబద్ధీకరించటానికి రాష్ట్ర పౌర సరఫరాలశాఖ జోక్యం చేసుకోవటం గమనార్హం. ఈమేరకు తెలంగాణ ఉల్లిపాయల డీలర్స్తోపాటు వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, చీఫ్ రేషనింగ్ అధికారులకు ఆదేశాలు పంపించారు. ఈ నెల 31 తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కిలో రూ.50
రాష్ట్రంలో ఉల్లిగడ్డల ధర గణనీయంగా పెరిగింది. కిలోకు రూ. 50 చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. రైతుబజార్లో రూ. 50 ఉంటే... గల్లీ మార్కెట్లలో కిలోకు రూ. 55 నుంచి రూ. 60 చొప్పున అమ్ముతున్నారు. గడిచిన నెల రోజులతో పోలిస్తే కిలోకు రూ. 20 నుంచి రూ. 30 చొప్పున ఉల్లిగడ్డల ధర పెరిగింది. పార్లమెంటులో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన ప్రభావం ఉల్లి మార్కెట్పై పడటం గమనార్హం. నిత్యవసర సరుకుల నిల్వ, నియంత్రణపై ఆంక్షలు, నియంత్రణను పూర్తిగా తొలగించటంతో ధరలు పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ విధించిన నియంత్రణ ఏమేరకు మార్కెట్ను స్థిరీకరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.