జనగామ జిల్లాలో ఐసీఎంఆర్ సర్వే
ABN , First Publish Date - 2020-12-29T04:32:29+05:30 IST
జనగామ జిల్లాలో ఐసీఎంఆర్ సర్వే

మొదటి రోజు ఐదు మండలాల్లో రక్త నమూనాల సేకరణ
జనగామ టౌన్, డిసెంబరు 28: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, ప్రజల ఆరోగ్య స్థితిగతులను అంచనావేయడంలో భాగంగా ఐసీఎంఆర్ బృందం సభ్యులు సోమవారం జనగామ జిల్లాలోని ఐదు మండలాల్లో సర్వే ప్రారంభించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ న్యూఢిల్లీ సౌజన్యంతో ఐసీఎంఆర్ బృందం డాక్టర్ ఆర్లప్ప పర్యవేక్షణలో జిల్లాలో ఐదు బృందాలుగా ఏర్పడి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మొదటి రోజు జనగామ మునిసిపాలిటీ 2వ వార్డు, బచ్చన్నపేట మండలం కోడవటూర్, లింగాలఘణపురం మండలం కళ్లెం, దేవరుప్పుల మండలం మదాపురం, నర్మెట మండలం హనుమంతాపూర్, గ్రామాలలో ఒక్కో గ్రామంలో 40 మంది చొప్పున మొత్తం 200 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. సేకరించిన రక్త నమూనాలను చెన్నైలోని ఐసీఎంఆర్ ల్యాబ్కు పంపిస్తామని ఐసీఎంఆర్ ప్రతినిధి డాక్టర్ ఆర్లప్ప తెలిపారు.రెండో రోజు స్టేషన్ఘన్పూర్, జఫర్గడ్, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో సర్వే చేస్తామన్నారు. సర్వేలో డీఎంహెచ్వో డాక్టర్ ఎ.మహేందర్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పూర్ణచందర్, వైద్య ఆధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.