ప్రియుడితో కలిసి భర్త హత్య

ABN , First Publish Date - 2020-12-27T08:29:37+05:30 IST

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.

ప్రియుడితో కలిసి భర్త హత్య

 ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భార్య యత్నం

 పోస్టుమార్టంతో నిజాలు వెలుగులోకి

 నిందితుల అరెస్టు, నల్లగొండ జిల్లాలో ఘటన


పెద్దవూర, డిసెంబరు 26: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పోస్టుమార్టంలో అసలు విషయం వెలుగుచూడటంతో మొత్తం బండారం బట్టబయలైంది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని సర్వేదుల గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


పీఏపల్లి మండలం నంభాపురం గ్రామానికి చెందిన రమావత్‌ స్వామి(35)కి పెద్దవూర మండలం బాసోనిబావి తండాకు చెందిన పుష్పలతతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పాప(8), బాబు(10) ఉన్నారు. పర్వేదుల గ్రామంలో స్వామి కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సంభాపురానికి చెందిన రవితో పుష్పలతకు కొంతకాలం క్రితం వివాహేతర బంధం ఏర్పడింది. వారిద్దరూ సాన్నిహిత్యంగా ఉండటం ఈ నెల 21న స్వామి కంటపడటంతో అతడు వారితో గొడవపడ్డాడు. స్వామిని అడ్డు తొలగించుకుంటేనే తమ బంధం కొనసాగుతునందని భావించిన పుష్పలత, రవి.. అదే రోజు రాత్రి స్వామి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం నోట్లో పురుగుల మందు పోశారు.


తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పుష్పలత చెప్పిన విషయాన్ని అందరూ నమ్మారు. తన కుమారుడు కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడని ఈ నెల 22న స్వామి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఈ క్రమంలో గొంతుపై కమిలిన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

దాంతోపాటు, స్వామి మృతికి పురుగుల మందు కారణం కాదని నివేదికలో తేలింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో.. ప్రియుడితో కలిసి పుష్పలత పరారయ్యేందుకు యత్నించింది. పెద్దవూర వై జంక్షన్‌లో పోలీసులకు చిక్కింది. ఇద్దరిపైనా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-12-27T08:29:37+05:30 IST