ఢిల్లీ ముప్పు ఎంత!
ABN , First Publish Date - 2020-03-30T10:28:07+05:30 IST
ఇంతకాలం విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టిన అధికారులు.. ఇప్పుడు ఢిల్లీ వెళ్లొచ్చిన వారి వివరాలను ఆరా తీస్తున్నారు. వీరి వల్ల ముప్పు ఎంత
ఎవరైనా వెళ్లి వచ్చారా వివరాలు సేకరించాలి: ఈటల
హైదరాబాద్ సిటీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఇంతకాలం విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టిన అధికారులు.. ఇప్పుడు ఢిల్లీ వెళ్లొచ్చిన వారి వివరాలను ఆరా తీస్తున్నారు. వీరి వల్ల ముప్పు ఎంత అనే విషయంపై వైద్యాధికారులు దృష్టి సారించారు. ఓ మతపరమైన సమావేశంలో పాల్గొనేందుకు ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, నాంపల్లికి చెందిన పలువురు ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చారు. వారిలో ఖైరతాబాద్కు చెంది న ఓ వృద్ధుడు మరణించిన తర్వాత చేసిన పరీక్షలో కరోనా లక్షణాలు కనబడ్డాయి. నాంపల్లి, కుత్బుల్లాపూర్కు చెందిన మరో ఇద్దరికి పాజిటివ్ రావడంతో పాటు వారి కుటుంబంలో మరో 10 మందికి వైరస్ సోకింది. దీంతో ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి వివరాలు సేకరించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం వైద్య, రెవెన్యూ శాఖల అధికారులకు టెలికాన్ఫరెన్స్లో ఆదేశించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు పలు కాలనీలు, బస్తీల్లో ఆరా తీస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా క్వారంటైన్లో పెట్టాలని మంత్రి సూచించారు. కరోనా లక్షణాలుంటే కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని, ఆ ప్రాంతంలో పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు.