మూడిండ్లు దగ్ధం

ABN , First Publish Date - 2020-12-29T04:17:58+05:30 IST

మూడిండ్లు దగ్ధం

మూడిండ్లు దగ్ధం
ఇనుగుర్తిలో ఆగ్రిప్రమాదంలో కాలిపోయిన ఇల్లు

ఇనుగుర్తిలో అగ్ని ప్రమాదం

కూతురి పెళ్లి కోసం తెచ్చిన నగదు బుగ్గి

రూ.10 లక్షల ఆస్తి నష్టం

కేసముద్రం, డిసెంబరు 28 : మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని ఇనుగుర్తిలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన రూ.10లక్షల ఆస్తి కాలిబూడిదయింది. ఈ ఘటనలో కూతురి పెళ్లి కో సం దాచిన నగదు రూ.4.30లక్షలు కాలిపోయాయి. గ్రామంలోని యాదవబజారులో చొప్పరి సాయిలు ఆయన కుమారు లు వెంకన్న, సూరయ్య ఒకే పెంకుటింట్లో తడికలతో విభజించి వేర్వేరుగా నివసిస్తున్నారు. ఉదయం ఆకస్మికంగా మం టలు చెలరేగడంతో సాయిలుతోపాటు ఇంట్లో ఉన్నవారంతా బయటకు పరుగులు తీశారు. ఆ వెంటనే దట్టమైన పొగలు వ్యాప్తి చెందాయి. కొద్దిసేపటికి భారీ శబ్ధంతో ఒక గ్యాస్‌ సి లిండర్‌ పేలడంతో పైకప్పులో ఉన్న పెంకులు ఎగిరి చుట్టుపక్కల ఇళ్లపై పడ్డాయి. ఇదే ఇంట్లో మరో మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉండడంతో ప్రమాదస్థలం వద్దకు వెళ్లేందుకు ఎవరికీ వీలుకాకుండా పోయింది. ఈలోగా మహబూబాబాద్‌ నుంచి అగ్నిమాపక యంత్రం వచ్చి మంటలను ఆర్పివేసింది. 

ఈప్రమాదంలో వెంకన్న కూతురు వివాహం కోసమని తీసుకువచ్చి బీరువాలో పెట్టిన రూ.4.30లక్షల నగదు, ఐదు తులాల బంగారం కాలిపోయాయి. ఆరు క్వింటాళ్ల బియ్యం, 20 క్వింటాళ్ల పత్తి, మంచం, టీవీ, రెండు బీరువాలు, బట్టలు, ఇతర సామగ్రి, వెంకన్న కుమారుడి ఒరిజినల్‌ డిగ్రీ సర్టిఫికెట్లు కాలిపోయాయి. సూరయ్య ఇంట్లో రూ.50వేల నగదు, రెండు తులాల బంగారం, 20 తులాల వెండి, 20 క్వింటాళ్ల పత్తి, ఆరు క్వింటాళ్ల బియ్యం, పట్టా పాస్‌పుస్తకం, కూలరు, టీవీ, మంచాలు, బీరువాలు, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. వెరసి రూ.10లక్షల ఆస్తి నష్టం కాగా ఈ ప్రమాదంతో మూడు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఎంఆర్‌ఐ బషీర్‌ ఘటన స్థలాన్ని సందర్శించి నష్టం వివరాలను నమోదు చేసుకున్నారు. సర్పంచ్‌ దార్ల రాంమూర్తి, సొసైటీ చైర్మన్‌ ధీకొండ వెంకన్న పరిశీలించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. 

Updated Date - 2020-12-29T04:17:58+05:30 IST