లక్షణాల్లేకుంటే హోం క్వారంటైనే

ABN , First Publish Date - 2020-06-01T08:59:08+05:30 IST

కరోనా పాజిటివ్‌గా తేలినా లక్షణాలు లేనివారిని ఇకపై హోం క్వారంటైన్‌లోనే ఉంచాలని నిర్ణయించారు. అటువంటివారికి సోమవారం నుంచి గాంధీ ఆస్పత్రిలో

లక్షణాల్లేకుంటే హోం క్వారంటైనే

హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్‌గా తేలినా లక్షణాలు లేనివారిని ఇకపై హోం క్వారంటైన్‌లోనే ఉంచాలని నిర్ణయించారు. అటువంటివారికి సోమవారం నుంచి గాంధీ ఆస్పత్రిలో అడ్మిషన్లు ఉండవని ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు చెప్పారు. కరోనా ఉండి లక్షణాలు లేని వ్యక్తుల ఇళ్లను అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ఇతరులకు వైరస్‌ సోకుండా  ప్రత్యేక బెడ్‌రూం, వాష్‌రూం, మరుగుదొడ్డి వేర్వేరుగా ఉన్నవారినే హోం క్వారంటైన్‌కు అనుమతినిస్తారని డాక్టర్‌ రాజారావు చెప్పారు. ఎలాంటి సదుపాయాలు లేకపోతే వారిని ప్రభుత్వ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది.


హోం క్వారంటైన్‌లో ఉండే వారికి ప్రభుత్వ వైద్యాధికారులే మందులు సరఫరా చేస్తారు. వారిని డీఎంఅండ్‌హెచ్‌వో, ఇతర వైద్యులు పర్యవేక్షిస్తుంటారు. ఒక వేళ లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చినవారికి శ్వాసకోశ  మధుమేహం, కిడ్నీ ఇతర జబ్బులున్నవారిని, గర్భిణులు, వృద్ధులను ఆస్పత్రిలో  చేర్చుకుంటారు. ప్రస్తుతం కరోనా అనుమానితులకు పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్‌ తేలితే గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇప్పటివరకు స్వల్ప లక్షణాలున్నవారి సంఖ్య సుమారు 400-500వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరందరినీ ఒకేసారి డిశ్చార్జ్‌ చేయాలా వద్దా అనే అంశంపై వైద్యులు తర్జనభర్జన పడుతున్నారు.

Updated Date - 2020-06-01T08:59:08+05:30 IST