బర్త్ డే వేడుకల్లో విషాదం.. భోజనం చేసిన వెంటనే..
ABN , First Publish Date - 2020-12-30T11:55:35+05:30 IST
బర్త్ డే వేడుకల్లో విషాదం.. భోజనం చేసిన వెంటనే..

హైదరాబాద్/బేగంపేట : స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న హోంగార్డు భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులు చేసుకుంటూ కిందపడి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనిసరావు కథనం ప్రకారం.. ఫతేనగర్కు చెందిన హోంగార్డు బోయ ఆనంద్ (34) డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 11.30 సమయంలో రసూల్పురలోని వల్లభ్బాయ్ పటేల్ కమ్యూనిటీ హాల్లో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు.
భోజనం చేసిన తర్వాత కుర్చీపై కూర్చొన్న అతను వాంతులు చేసుకుంటూ, ఒక్కసారిగా కిందపడిపోయాడు. పక్కన ఉన్న వారు అతడిని పైకి లేపేందుకు యత్నించగా, అప్పటికే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే 108కు ఫోన్ చేయగా, వారు వచ్చి అప్పటికే చనిపోయాడని తెలిపారు. అయితే బోయ ఆనంద్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, దర్యాప్తు చేయాలని మృతుని తండ్రి రిటైర్ట్ ఎస్.ఐ శివప్ప మంగళవారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.