మట్టపల్లి వద్ద హైలెవల్ వంతెన, అప్రోచ్ రోడ్డు ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-28T21:01:37+05:30 IST
మట్టపల్లి వద్ద హైలెవల్ వంతెన, అప్రోచ్ రోడ్డును మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, జగదీష్రెడ్డి ప్రారంభించారు.

సూర్యాపేట: మట్టపల్లి వద్ద హైలెవల్ వంతెన, అప్రోచ్ రోడ్డును మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, జగదీష్రెడ్డి ప్రారంభించారు. హైలెవెల్ వంతెనకు శ్రీ లక్ష్మీనరసింహ వారధిగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ పేదలు, రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశ తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రథమ స్థానం సాధించిందన్నారు. కృష్ణానదిపై హై లెవెల్ వంతెన ఏర్పాటుతో ఏపీ-తెలంగాణ మధ్య రాకపోకలు మెరుగుపడ్డాయని మంత్రి జగదీష్రెడ్డి పేర్కొన్నారు. వరి పంట కాకుండా ఇతర పంటల ద్వారా ఆదాయం సాధించాలని జగదీష్రెడ్డి చెప్పారు.
మట్టపల్లి వద్ద హైలెవల్ వంతెన ప్రారంభించడంతో ఏపీ-తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతెన ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య సుమారు 70కిలోమీటర్ల దూరం తగ్గింది. 2014జనవరి 11న ఈ వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. మట్టపల్లి వద్ద కృష్ణానదిపై రూ.50కోట్లతో నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద గల కృష్ణానదిపై రూ.50కోట్లు నిధులు మంజూరు చేయించారు.