చేనేత కార్మికులను ఆదుకోవాలంటూ హైకోర్టులో విచారణ... వాయిదా

ABN , First Publish Date - 2020-06-23T00:59:06+05:30 IST

చేనేత కార్మికులను ఆదుకోవాలంటూ హైకోర్టులో విచారణ... వాయిదా

చేనేత కార్మికులను ఆదుకోవాలంటూ హైకోర్టులో విచారణ... వాయిదా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన పిల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం విచారించింది. పిటీషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 లక్షల మంది చేనేత కార్మికులు గత మూడు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే రూ.200 కోట్ల చేనేత ముడి సరుకు కార్మికుల వద్ద సిద్ధంగా ఉందన్నారు. 


చేనేత ముడి సరుకును మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలని పిటీషనర్ కోర్టుకు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో ఉపాధి లేని చేనేత కార్మికులకు నెలకు రూ.30 వేలు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. అలాగే చనిపోయిన చేనేత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని పిటీషనర్ కోరారు. ఈ పిల్‌పై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా... చేనేత కార్మికులకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదని  సీనియర్ కౌన్సిల్ రంగయ్య కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ సమయంలో  చేనేత  కార్మికులకు ప్రభుత్వం ఏమైనా  ఇచ్చిందా?  ఇచ్చే ఆలోచన  ఏమైనా ఉందా? అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. 


ప్రభుత్వం ఏ విధమైన ఆర్థిక సహాయం చేయలేదని రంగయ్య కోర్టుకు తెలిపారు. లాక్‌డౌన్ నుంచి  ఈరోజు వరకు రాష్ట్రంలో  ఏ ఒక్క  చేనేత కార్మికుని ఆర్థిక సహాయం అందలేదని వెల్లడించారు. అందరికీ ఇచ్చిన విధంగా బియ్యం, రూ.1500 నగదు ఇచ్చినట్లు కోర్టుకు తెలియజేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం టెక్స్‌టైల్ డిపార్ట్మెంట్ ఒక సర్కులర్  జారీ చేసిందని రంగయ్య తెలిపారు. తయారైన  మొత్తం సరుకు 45 రోజులలో కొంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం  కౌంటర్‌లో పేర్కొన్న అంశాలన్నీ తప్పులతో కూడుకుందని రంగయ్య కోర్టుకు విన్న వించారు. ప్రభుత్వం ధాఖలు చేసిన కౌంటర్‌పై రీప్లై కౌంటర్ వేస్తామని పిటిషన్ తరపు న్యాయవాది రంగయ్య తెలిపారు. 10 రోజుల్లో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పిటీషనర్‌కు హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను జులై 2 కు వాయిదా వేసింది. 

Updated Date - 2020-06-23T00:59:06+05:30 IST