ఉస్మానియా ఆస్పత్రిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని హైకోర్టులో పిల్
ABN , First Publish Date - 2020-10-19T22:20:27+05:30 IST
ఉస్మానియా ఆస్పత్రిలో వరద నీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని హైకోర్టులో డెక్కన్ ఆర్కియాలాజికల్, కల్చరల్ రీసెర్చ్ సొసైటీ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ను సోమవారం హైకోర్టు విచారించింది.

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో వరద నీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని హైకోర్టులో డెక్కన్ ఆర్కియాలాజికల్, కల్చరల్ రీసెర్చ్ సొసైటీ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ను సోమవారం హైకోర్టు విచారించింది. వర్షం నీరు బయటకు వెళ్లే ఏర్పాట్లు లేక ఆస్పత్రిలో నీరు నిండుతొందన్న పిటిషనర్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని, ఉస్మానియా ఆస్పత్రిలో వర్షం నీరు మూసీలో కలిసేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రోగులు ఇబ్బంది పడ్డారని న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ నవంబరు 12కి వాయిదా హైకోర్టు వేసింది.
రాష్ట్రంలోని రెండు పెద్ద ఆస్పత్రుల్లో ఒకటైన ఉస్మానియా వార్డుల్లో అడుగులోతు వరద నీరు చేరిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియా ద్వారా దేశమంతటా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఉస్మానియాలో మురుగునీరు చేరడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ) కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆస్పత్రిలో నీరు చేరడం వల్ల పలు వార్డుల్లో రోగులు అవస్థలు పడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్కు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది.