పీపీలు లేక బాధితులకు న్యాయం జరగట్లేదు
ABN , First Publish Date - 2020-10-03T09:41:48+05:30 IST
ట్రయల్, క్రిమినల్ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)ల పోస్టుల ఖాళీలపై హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు

పోస్టుల ఖాళీపై హైకోర్టు వ్యాఖ్యలు
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ట్రయల్, క్రిమినల్ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)ల పోస్టుల ఖాళీలపై హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీ పోస్టులు భర్తీ చేయడానికి ఇంకెంత కాలం కావాలంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఏపీపీ/పీపీ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల బాధితులకు సకాలంలో న్యాయం జరగడం లేదంటూ 2018లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీజేకు రాసిన లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎ్స.చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం సుమోటో పిల్గా స్వీకరించి.. ఇటీవల మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 270 పీపీ పోస్టులకు కేవలం 70 పోస్టులను భర్తీ చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. తగినంత మంది పీపీలు లేకపోవడం వల్ల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని అభిప్రాయపడింది. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన కేసుల విషయంలో రెగ్యులర్ పీపీల కొరత వేధిస్తోందని తెలిపింది. పీపీలకు తగిన శిక్షణ లేకపోవడంవల్ల చాలా కేసులు వీగిపోతున్నాయని, దీంతో నేరస్థులు శిక్షనుంచి తప్పించుకుంటున్నారని పేర్కొంది. నేరస్థులకు శిక్షలు పడాలంటే పీపీల వ్యవస్థ బలంగా ఉండాలని, ఇందుకోసం పీపీలకు వృత్తి నైపుణ్యాల్లో సరైన శిక్షణ ఇవ్వాలని సూచించింది. పీపీల సమర్థత వల్లే బాధితులకు సరైన న్యాయం అందుతుందని, సమాజ భద్రతకు ఈ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్కు స్పష్టం చేసింది. పీపీ పోస్టుల ఖాళీలను ఎంతకాలంలో భర్తీ చేస్తారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 10కి వాయిదా వేసింది.