‘ఎమ్మార్’పై తాజా రిట్ 15 ఏళ్ల తర్వాత ఎలా వేస్తారు?: హైకోర్టు
ABN , First Publish Date - 2020-12-30T08:22:36+05:30 IST
దుబాయికి చెందిన ఎమ్మార్ పీజేఎస్సీ, ఏపీఐఐసీ గతంలో సంయుక్తంగా చేపట్టిన ప్లాట్లు, విల్లాల కేటాయింపుల వ్యవహారంలో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని దాఖలైన రిట్పై తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): దుబాయికి చెందిన ఎమ్మార్ పీజేఎస్సీ, ఏపీఐఐసీ గతంలో సంయుక్తంగా చేపట్టిన ప్లాట్లు, విల్లాల కేటాయింపుల వ్యవహారంలో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని దాఖలైన రిట్పై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఇదే అంశంపై గతంలోనే (ఉమ్మడి) హైకోర్టు విచారణ జరిపిందని, సీబీఐ దర్యాప్తు కూడా జరుగుతోందని, ఈ నేపథ్యంలో తామెలా విచారణ చేయగలమని ప్రశ్నించింది. ఎమ్మార్ ప్రాపర్టీ్సపై కింది కోర్టులో కేసులు ఉండగా సమాంతరంగా ఎలా విచారణ చేస్తామన్న సందేహాన్ని కూడా లేవనెత్తింది. 2005లో అవార్డు ఇస్తే 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిట్ ఎలా వేస్తారని అడిగింది. ఇదే అంశంపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని అందజేయాలని పిటిషనర్ను ఆదేశించింది. విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎ్స.రామచంద్రరావు, జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి కొన్న ప్లాట్లను కొనుగోలుదారులకు తెలియకుండా భూ సేకరణ నోటిఫికేషన్ కింద తీసుకున్నందుకు తమకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని కె.హరీశ్, మరో 80 మంది హైకోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా నానక్రామ్గూడలో కిరణ్ కృష్ణ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ నుంచి 23 ఎకరాల్లోని ప్లాట్లను పిటిషనర్లు కొన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి తెలిపారు. ప్రత్యామ్నాయ భూమి కోసం అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో హైకోర్టుకు వచ్చామన్నారు.