హేమంత్, అవంతి ప్రేమకు కారణం ఎవరంటే!
ABN , First Publish Date - 2020-09-27T23:22:33+05:30 IST
రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యను రాష్ట్ర ప్రజలు ఇంకా పూర్తిగా మరువక ముందే సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్ నగర శివారులో జరిగింది.
హైదరాబాద్: రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యను రాష్ట్ర ప్రజలు ఇంకా పూర్తిగా మరువక ముందే సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్ నగర శివారులో జరిగింది. మరో కులోన్మాద హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే తమ కులం కాని, తమ అంతస్తుకు తగని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కారణంతో కన్నవారే కర్కశంగా కూతురి భర్తను హత్య చేయించారు. చందానగర్కు చెందిన దొంతిరెడ్డి లక్ష్మారెడ్డి కూతురు అవంతిరెడ్డి (23), అదే ప్రాంతంలో ఉంటున్న చింత మురళీకృష్ణ కుమారుడు చింత యోగ హేమంత్కుమార్ (28) ప్రేమ వివాహం చేసుకున్నారు. కూతురి ప్రేమ పెళ్లిని అంగీకరించక సుపారీ ఇచ్చి, ఆమె భర్తను తల్లిదండ్రులు చంపించారు.
అయితే హేమంత్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హేమంత్ తల్లి, అవంతి తల్లి అర్చన స్నేహితులని పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. అవంతి ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగిన.. హేమంత్ తల్లి బ్యూటిషియన్గా వెళ్లేందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అవంతి, హేమంత్ తల్లికి దగ్గరైంది. ఆ తర్వాత ఆమె హేమంత్తో ప్రేమలో పడింది. అవంతి, హేమంత్ల ప్రేమ విషయం తెలుసుకున్న అవంతి తల్లిదండ్రులు గతేడాది నవంబరు నుంచి ఆమెను సుమారు 8 నెలలపాటు ఇంటినుంచి బయటకు రాకుండా చేశారు. 2020 జూన్ 9న అవంతిరెడ్డి రహస్యంగా బయటకు వచ్చింది. హేమంత్ను కలిసి జూన్ 10న బీహెచ్ఈఎల్లోని సంతోషిమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు.