ఈ రోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు: హరీష్‌రావు

ABN , First Publish Date - 2020-04-24T19:59:43+05:30 IST

సిద్దిపేట: సిద్దిపేటకు నేడు గోదావరి జలాలు అంది వచ్చాయి. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ టన్నెల్ లోని పంపు సెట్ స్విచ్ ఆన్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఈ రోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు: హరీష్‌రావు

సిద్దిపేట: సిద్దిపేటకు నేడు గోదావరి జలాలు అంది వచ్చాయి. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ టన్నెల్ లోని పంపు సెట్ స్విచ్ ఆన్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రిజర్వాయర్ లోకి నీళ్లు రాగానే మంత్రులు పూలతో జలహారతి పట్టారు. అనంతరం హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత ఆనందంగా ఉందో ఈరోజు అంత ఆనందంగా ఉంది.సిద్దిపేటకు గోదావరి నీళ్లు అనేది దశాబ్దాల కల. ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ దేశానికి దారి చూపింది. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్దాల నిర్మాణం అన్న దశ నుంచి రెండు, మూడు ఏళ్ళల్లోనే నిర్మించ వచ్చని చూపింది తెలంగాణ. 


ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన కూలీలను కూడా మేము మర్చిపోము. ఈ ప్రాంతం ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు, వలసల జిల్లాగా ఉండేది. సమైక్య రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా సిద్దిపేటకు రాలేదు. ఈ రోజు కాలం, కరెంట్‌తో నిమిత్తం లేకుండా రెండు పంటలు పండించుకోవచ్చు. సిద్దిపేట.. జిల్లా కావాలి, రైలు రావాలి, గోదావరి జలాలు రావాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ అంటుండే వారు. జిల్లా ఏర్పాటైంది, రైలు పనులు జరుగుతున్నాయి, గోదావరి జలాలు సిద్దిపేటను ముద్దాడాయి. ఒక ప్రజాప్రతినిదిగా ఇంతకంటే మధురానుభూతి మరోటి లేదు’’ అని హరీష్ రావు పేర్కొన్నారు. అలాగ ఈ ప్రాంతంలో పరిశ్రమల నిర్మాణానికి, ఐటి హబ్‌ను ఏర్పాటు చేయాల్సినదిగా మంత్రి కేటీఆర్‌ను హరీష్ రావు కోరారు.


Updated Date - 2020-04-24T19:59:43+05:30 IST