అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కడతాం: హరీశ్‌

ABN , First Publish Date - 2020-03-13T09:53:53+05:30 IST

తమది రైతు ప్రభుత్వం అని, అలాంటి అన్నదాతలకు సాగునీటిని ఇచ్చేందుకు అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కడతామని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. భూములను

అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కడతాం: హరీశ్‌

కొత్త మైనింగ్‌ పాలసీని ప్రవేశపెడతాం

కాంగ్రెస్‌ భ్రమలను బడ్జెట్‌ బద్దలుకొట్టింది

కాంగ్రెస్‌ది కరెంటు బంద్‌ సర్కారు.. 

మాది రైతుబంధు సర్కారు : హరీశ్‌ 

హైదరాబాద్‌, మార్చి 12(ఆంధ్రజ్యోతి): తమది రైతు ప్రభుత్వం అని, అలాంటి అన్నదాతలకు సాగునీటిని ఇచ్చేందుకు అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కడతామని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. భూములను, నిరర్ధక ఆస్తులను అమ్మి... వచ్చిన నిధులను పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం వెచ్చిస్తామని పేర్కొన్నారు. మైనింగ్‌, ఇసుక ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని, కొత్త మైనింగ్‌ పాలసీని తెస్తామని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్‌ హాలిడేలు ప్రకటించేవారని, ఇప్పుడు పరిశ్రమలకు మూడు షిప్టుల్లో 24గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును టీఆర్‌ఎస్‌ సర్కారు ఇస్తోందన్నారు. ఆ రకంగా ‘కాంగ్రె్‌సది కరెంట్‌ బంద్‌ ప్రభుత్వమైతే మాది రైతుబంధు ప్రభుత్వం’ అని హరీశ్‌ అన్నారు. బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. బడ్జెట్‌ను మానవీయ కోణంలో సీఎం కేసీఆర్‌ తయారు చేశారని చెప్పారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ద్వజమెత్తారు. ఒకవైపు ప్రాజెక్టుల కోసం అప్పులు తెస్తున్నారంటూ విమర్శిస్తూనే.. మరోవైపు బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.11వేల కోట్లు మాత్రమే కేటాయిస్తూ ప్రాజెక్టులు ఎలా పూర్తిచేస్తారని ప్రశ్నిస్తున్నారని.. అదే సమయంలో ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంపై 2004-14 మధ్య పదేళ్లకాలంలో రూ.1,42,792 కోట్లు వ్యయం చేస్తే.. తాము ఈ ఐదేళ్లలో రూ.1.2లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో 150 కిలోమీటర్ల మేర గోదావరి జీవనదిగా పూర్వ వైభవాన్ని పొందిదన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. 2019-20 కింద రైతుబంధు పథకానికి రూ.12వేల కోట్లు కేటాయిస్తే, 10,805 కోట్లు పంపిణీ చేశామన్నారు. బడ్జెట్‌తో ప్రజలంతా ఆనందంగానే ఉన్నారని, నిరాశ చెందింది కాంగ్రెస్‌ పార్టీయేనని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని కాంగ్రెస్‌ భావించిందని, ప్రజలకిచ్చిన హామీలను ప్రతిబింబించడం ద్వారా కాంగ్రెస్‌ భ్రమలను బడ్జెట్‌ బద్దలు కొట్టిందని చెప్పారు. అన్ని ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా పార్టీ తీరులో మార్పురావడం లేదని.. ఇక ఆ పార్టీని దేవుడే కాపాడాలని అన్నారు. 

 

అప్పులన్నీ పెట్టుబడి వ్యయం కోసమే 

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ పెట్టుబడి వ్యయంపైనే పెడుతున్నామని, అప్పులను రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోణంలో చూడాలని హరీశ్‌ అన్నారు. జీఎ్‌సడీపీలో 3 శాతాన్ని అప్పు తెచ్చుకునే హక్కు రాష్ట్రాలకు ఉంటుందని, ఆ అప్పుతో రెవెన్యూ లోటును పూడ్చుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. జీఎ్‌సడీపీలో 21.03 శాతానికి లోబడి అప్పులు చేశామని వెల్లడించారు. అప్పుల పరంగా తెలంగాణ దిగువ నుంచి ఆరోస్థానంలో ఉందన్నారు. సుస్థిరాభివృద్ధిలో 82 పాయింట్లతో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, నీతి ఆయోగ్‌ చెప్పిందని, పెట్టుబడి వ్యయంలోనూ తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని పేర్కొన్నారు. కోకాపేట భూముల కేసులో విజయం సాధించామని, ఆ భూములను అమ్ముతామని చెప్పారు.


ప్రపంచ వేదికలపై కేటీఆర్‌కు పొగడ్తలు లభించాయి

 ఇప్పటికే 2,72,763 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేశామని, అవి వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు.  ఈ బడ్జెట్‌లోనూ హౌసింగ్‌ స్కీమ్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఐటీ రంగంలో ఏర్పాటు చేసిన టీ-హబ్‌ను ప్రపంచమే హర్షించిందని, విశ్వ వేదికలపై మంత్రి కేటీఆర్‌కు పొగడ్తలు లభించాయన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 869 గగురుకులాల్లో 4,41,497 మంది చదువుతున్నారని చెప్పారు. 


జీఎస్‌టీ బకాయిలు 933 కోట్లు ఇప్పించండి

అన్నింటికీ కేంద్రమే నిధులిస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చెబుతుంటారని కేంద్రం నుంచి రూ.933 కోట్ల జీఎ్‌సటీ బకాయిలు రావాలని, వాటిని ఆయన ఇప్పించాలని హరీశ్‌ అన్నారు. ఐజీఎ్‌సటీ కింద రూ.2812 కోట్లు రావాలని, కాకతీయ, భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలంటూ నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిందని,  పన్నుల వాటా కింద రాష్ట్రానికి రూ4,595కోట్లు తగ్గించారని తొలుత వీటన్నింటిని ఇప్పించాలన్నారు.  


వివిధ దశల్లో 27వేల పోస్టుల ప్రక్రియ

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని విమర్శిస్తున్నారని, అయితే, ఇప్పటివరకు 1,23,075 ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాయని హరీశ్‌ వివరించారు. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 1,50,260 ఉద్యోగ నియామకాలకు అనుమతి ఇచ్చాం. ఇందులో 1,23,075 ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసి, భర్తీ ప్రక్రియను పూర్తి చేశాం. ఇంకా, 27,131 పోస్టుల ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది’’ అని వివరించారు. 

Updated Date - 2020-03-13T09:53:53+05:30 IST