నియంత్రిత కాదు.. ప్రాధాన్య సాగు
ABN , First Publish Date - 2020-06-11T09:22:33+05:30 IST
నియంత్రిత కాదు.. ప్రాధాన్య సాగు

రైతులకు లాభం చేకూర్చడమే ప్రభుత్వ ఉద్దేశం
వచ్చే వారం రెండో విడత రుణమాఫీ: మంత్రి హరీశ్
సంగారెడ్డి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని అమలు చేయనున్నది నియంత్రిత సాగు విధానం కాదని.. ప్రాధాన్య సాగు విధానమని మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డిలో నూతనంగా నిర్మించిన జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ పంటలకు దిగుబడి ఎక్కువగా రావాలని, గిట్టుబాటు ధర రావాలన్న ఉద్దేశంతోనే సాగులో మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. రూ.25వేలలోపు రుణాలున్న రైతుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయగానే.. మాఫీ డబ్బు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. రెండో విడతలో భాగంగా వచ్చే వారం నుంచి రూ.75వేలలోపు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో లాక్డౌన్ వల్ల అన్ని వర్గాలు నష్టపోయినా.. రైతులకు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు.