వేధింపుల కేసు రాజీకి యత్నం..ఐదుగురు టీచర్లపై సస్పెన్షన్ వేటు
ABN , First Publish Date - 2020-12-26T08:03:04+05:30 IST
లైంగిక వేధింపుల కేసులో ఉపాధ్యాయుడిని రక్షించేందుకు ప్రయత్నించిన ఐదుగురు టీచర్లపై సస్పెన్షన్ వేటు పడింది
![వేధింపుల కేసు రాజీకి యత్నం..ఐదుగురు టీచర్లపై సస్పెన్షన్ వేటు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
‘చింతవర్రె’ టీచర్ను కాపాడే యత్నం.. కలెక్టర్ సీరియస్
లక్ష్మీదేవిపల్లి, డిసెంబరు 25: లైంగిక వేధింపుల కేసులో ఉపాధ్యాయుడిని రక్షించేందుకు ప్రయత్నించిన ఐదుగురు టీచర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చింతవర్రె ప్రాథమిక పాఠశాలకు చెందిన టీచర్ దొడ్డ సునీల్ కుమార్.. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడగా, గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, జైలుకు పంపారు. అయితే, నిందితుడిని కాపాడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా మహిళ సంఘాలు, రాజకీయ నాయకులు ఇటీవల కలెక్టర్ను కలిసి విన్నవించారు. ఘటన పూర్వాపరాలపై ఆరా తీసిన కలెక్టర్... రాజీ కుదిర్చేందుకు యత్నిస్తున్న ఐదుగురు టీచర్లపై చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు తోలం శేషగిరిరావు(ఎస్జీటీ), శ్రీనివాసరావు(ఎస్జీటీ), జి.వీరభద్రం (గ్రేడ్-2 హెచ్పీటీ), సీహెచ్.రామయ్య (ఎస్ఏ), జె.లింగయ్య (హెచ్ఎం)లను సస్పెండ్ చేస్తూ డీఈవో సోమశేఖరశర్మ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.