గురుకులంలో కలకలం

ABN , First Publish Date - 2020-11-29T07:19:04+05:30 IST

జగిత్యాల జిల్లాలో కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. గత వారం వివాహానికి హాజరైన 30 మంది వైరస్‌ బారినపడగా.. తాజాగా కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కళాశాలలో 75 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో 67 మంది విద్యార్థులు. మిగతావారు కళాశాల సిబ్బంది. అల్లమయ్య గుట్ట ప్రాంతంలో ఉన్న

గురుకులంలో కలకలం

కోరుట్ల మహిళా కళాశాలలో 75 మందికి కరోనా

వీరిలో 67 మంది విద్యార్థులు.. 8 మంది సిబ్బంది

కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడం లేదనే ఆరోపణలు


హైదరాబాద్‌/కోరుట్ల, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలో కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. గత వారం వివాహానికి హాజరైన 30 మంది వైరస్‌ బారినపడగా.. తాజాగా కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కళాశాలలో 75 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో 67 మంది విద్యార్థులు. మిగతావారు కళాశాల సిబ్బంది. అల్లమయ్య గుట్ట ప్రాంతంలో ఉన్న ఈ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదివేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 280 మందికి సీట్లు దొరికాయి. ఈ క్రమంలో అధికారులు నాలుగు రోజులుగా విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర సామగ్రి పంపిణీ చేస్తున్నారు.


హాస్టల్‌ వసతి కల్పిస్తున్నారు. అయితే, నలుగురు విద్యార్థులకు జ్వరం రావడంతో కళాశాల ఉపన్యాసకులు, సిబ్బంది ప్రిన్సిపల్‌కు తెలిపారు. దీంతో అడ్మిషన్‌ పొందిన 280 మంది విద్యార్థులతో పాటు సిబ్బందికి కూడా వైద్యులు శనివారం పరీక్షలు చేశారు. ఇందులో 75 మందికి పాజిటివ్‌గా తేలింది. విద్యార్థినులను కళాశాలలోనే క్వారెంటైన్‌ శిబిరంలో ఉంచారు. కొవిడ్‌ జాగ్రత్తలు పాటించకుండా కళాశాల నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్‌ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పరీక్షలు చేయించుకుని రావాలని విద్యార్థులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.


రాష్ట్రంలో కొత్తగా 753 మందికి కరోనా సోకిందని, వైరస్‌తో ముగ్గురు చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. శుక్రవారం 41,991 మందికి పరీక్షలు నిర్వహించామని పేర్కొంది. 952 మంది కోలుకున్నారు.

Updated Date - 2020-11-29T07:19:04+05:30 IST