ప్రభుత్వ భూమిని కాపాడండి
ABN , First Publish Date - 2020-12-14T04:35:02+05:30 IST
ప్రభుత్వ భూమిని కాపాడండి

తాగునీటి బోర్ను చూపిస్తున్న గుట్ట వాసులు
చిలుపూర్, డిసెంబరు 13: మండల కేంద్రంలోని చిలుపూర్ గుట్టలో ఉన్న ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోందని, రెవెన్యూ అధికారులు దాన్ని కాపాడాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు పంతం రాజు, రాపోలు లింగస్వామి, రాపోలు ఎల్లస్వామి, యాట రమేష్ కోరారు. ఆదివారం వారు మాట్లాడుతూ 60 ఏళ్ళ క్రితం గుట్ట దిగువన చిలుపూర్ గ్రామానికి వెళ్ళే క్రాస్రోడ్ సమీపంలో ప్రభుత్వ స్థలంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తాగునీటి కోసం బోర్ వేశారని, దాని ద్వారానే ప్రస్తుతం భక్తులతో పాటు, పరిసర ప్రాంత ప్రజలకు దాహార్తి తీరుతోందని స్పష్టం చేశారు. అయితే ఇటీవల పక్క స్థలానికి చెందిన ఓ వ్యక్తి సదరు ప్రభుత్వ భూమని ఆక్రమించడంతో పాటు, వేరే వ్యక్తికి విక్రయించేందుకు యత్నిస్తున్నాడని, బోరును సైతం ధ్వంసం చేశాడని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.