గూగుల్లోకి సైబర్ దొంగలు!
ABN , First Publish Date - 2020-09-25T13:56:21+05:30 IST
గూగుల్ను వేదికగా చేసుకొని.. మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించడానికి గూగుల్ ప్రతినిధులు పోలీసులకు సహకరించాలన్నారు సైబరాబాద్ సీపీ
![గూగుల్లోకి సైబర్ దొంగలు!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020092508232288/09252020082432n75.jpg)
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): గూగుల్ను వేదికగా చేసుకొని.. మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించడానికి గూగుల్ ప్రతినిధులు పోలీసులకు సహకరించాలన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్ల సమాచారం పోలీసులకు అందజేస్తే వారి భరతం పడతామని చెప్పారు. ఈ మేరకు సైబరాబాద్ కమిషనరేట్లో గూగుల్ ఇండియా ప్రై. లిమిటెడ్ ప్రతినిధులతో గురువారం వెబినార్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
నోడల్ అధికారి ఏర్పాటుకు నిర్ణయం
సైబర్ నేరాలపై పోలీసులకు అందుతున్న ఫిర్యాదులను పరిష్కరించడానికి గూగుల్ నుంచి అవసరమైన సమాచారం అందించడానికి ఒక ప్రత్యేక నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ అధికారి సైబర్ నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 24/7 విచారణాధికారులకు అందుబాటులో ఉండి సహకరించాలని గూగుల్ ప్రతినిధులను కోరారు. అంతేకాకుండా ఒక ప్రత్యేక టెక్నికల్ బృందాన్ని ఏర్పాటు చేసి సైబర్ నేరగాళ్లపై, వారు వినియోగిస్తున్న టెక్నికల్ ఐపీ అడ్ర్సలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీసీపీ క్రైమ్స్ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్యామ్బాబు, ఇన్స్పెక్టర్లు, గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు సునీతా మొహంతి, దీపక్ సింగ్ పాల్గొన్నారు.