బ్యాలెట్తోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు?
ABN , First Publish Date - 2020-10-04T08:03:07+05:30 IST
టర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను బ్యాలెట్ ద్వారానే..
రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన?..
ఈవీఎం, వీవీ ప్యాట్లు లేకపోవడమే కారణం!
ఏపీ, కర్ణాటక నుంచి బ్యాలెట్ బాక్సులు
ఆ రాష్ట్రాలకు లేఖ రాసిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను బ్యాలెట్ ద్వారానే నిర్వహించాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ దిశగా ఏర్పాట్లూ చేస్తున్నారు. టీఆర్ఎస్ సహా మెజారిటీ పార్టీలు బ్యాలెట్ పోలింగ్ నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారికంగా నిర్ణయం వెలువడనున్నట్లు తెలిసింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు అందుబాటులో లేకపోవడమే బ్యాలెట్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈ క్రమంలో ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రెండు రాష్ర్టాల ప్రభుత్వాలకు జీహెచ్ఎంసీ లేఖ కూడా రాసినట్టు ఓ అధికారి చెప్పారు. తెలంగాణలో కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికలు ముగిసిన అనంతరం ఇక్కడి 29 వేల బ్యాలెట్ బాక్సులను స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏపీ ఎన్నికల సంఘం తీసుకెళ్లింది. కొవిడ్ విజృంభణ, కోర్టుల్లో పిటిషన్లు వేయడంతో ఏపీలో ఎన్నికలు వాయిదా పడ్దాయి. ఏపీ నుంచి బ్యాలెట్ బాక్సులను తిరిగి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
40-45 వేల బాక్సులు అవసరం!
గ్రేటర్లోని 150 డివిజన్లలో 7 వేల పోలింగ్ బూత్లున్నాయి. గతంలో ఒక్కో పోలింగ్ స్టేషన్కు 1400 మంది ఓటర్లు ఉండగా.. కొవిడ్ నేపథ్యంలో 750 నుంచి 800 మంది ఓటర్లకు ఒక బూత్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ సంఖ్య 1000 ఓటర్ల వరకూ పెరుగవచ్చని చెబుతున్నారు. ఈ లెక్కన గ్రేటర్లో 11,500 నుంచి 12 వేల పోలింగ్ బూత్లు ఏర్పాటుచేసే అవకాశముంది. ఒక్కో బూత్కు అభ్యర్థుల సంఖ్యను బట్టి రెండు లేదా మూడు బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. 20ు అదనపు బాక్సులతో కలిపి 40-45 వేల వరకు బ్యాలెట్ బాక్సులు సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ఏపీ వద్ద ఉన్న తెలంగాణకు చెందిన 29 వేల బాక్సులతోపాటు ఆ రాష్ట్రంలో ఉన్న బాక్సులు.. అవసరమైతే కర్ణాటక నుంచి మరికొన్ని బాక్సులు తీసుకొచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల కొరతే కారణమా?
బ్యాలెట్ వినియోగించినా.. ఈవీఎంలతో ఎన్నికలకు వెళ్లినా.. కరోనా వ్యాప్తి తీవ్రత అదే స్థాయిలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈవీఎం అయితే బటన్ నొక్కాల్సి ఉంటుంది. బ్యాలెట్ అయినా... గుర్తు లు ఉండే కాగితంపై స్టాంపు వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓటర్లందరూ ఒకే స్టాంప్ ముట్టుకోవాలి. ఈ క్రమంలో జాగ్రత్తలే ముఖ్యమని అధికారులంటున్నారు. వీవీ ప్యాట్లు అందుబాటులో లేకపోవడం వల్లే బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎం-2 ఈవీఎంలున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త వీవీ ప్యాట్లకు ఇవి సపోర్ట్ చేయవు. ఈ క్రమంలో ఎం-3 ఈవీఎంల కొనుగోలు తప్పనిసరి. దీనికి రూ.50 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈసీఐఎల్ కూడా ఇప్పుడు ఎం-3 ఈవీఎంలు ఇచ్చే పరిస్థితి లేదని ఓ అధికారి చెప్పారు.
మీరే నిర్ణయించండి..
ఎన్నికలను ఏ పద్ధతిలో నిర్వహించాలని ఎస్ఈసీ రాసిన లేఖపై జీహెచ్ఎంసీ స్పందించింది. ఏ విధానంలో ఎన్నికలకు వెళ్లినా తమకు అభ్యంతరం లేదని, ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు పేర్కొన్నారు. ఈవీఎంలా? బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలా? అన్న నిర్ణయం మీరు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేశారు. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని చెబుతున్నారు.