నేటి నుంచి గాంధీలో సాధారణ సేవలు
ABN , First Publish Date - 2020-11-21T08:17:56+05:30 IST
గాంధీ ఆస్పత్రిలో శనివారం నుంచి సాధారణ (నాన్ కోవిడ్) సేవలు అందించనున్నారు. అన్ని విభాగాల అవుట్ పేషంట్ (ఓపీ), ఇన్ పేషంట్ (ఐపీ) సేవలతో పాటు.. ఎలక్టివ్, అత్యవసర

నెలల తర్వాత అన్ని విభాగాల ఓపీ, ఐపీ సేవలు
హైదరాబాద్ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో శనివారం నుంచి సాధారణ (నాన్ కోవిడ్) సేవలు అందించనున్నారు. అన్ని విభాగాల అవుట్ పేషంట్ (ఓపీ), ఇన్ పేషంట్ (ఐపీ) సేవలతో పాటు.. ఎలక్టివ్, అత్యవసర శస్త్ర చికిత్సలు కూడా చేయనున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఎనిమిది నెలలుగా గాంధీలో కొవిడ్ రోగులకే సేవలు అందిస్తున్నామని, ప్రస్తుతం ఆస్పత్రిలో కరోనా కేసులు మూడు వందల లోపే ఉండడంతో సాధారణ సేవలందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. నిబంధనల మేరకు రోగులను ఆస్పత్రిలోకి అనుమతిస్తామన్నారు. కొవిడ్, నాన్ కొవిడ్ సేవల కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేశామని, క్యాజువాలిటీ దగ్గరలోని ర్యాంప్ వద్ద అవుట్ పేషంట్ సేవలను అందించనున్నట్లు చెప్పారు. కొవిడ్, నాన్ కొవిడ్ రోగులు కలిసిపోతే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉండడంతో ఒక భవనంలోకి మరొకరు వెళ్లకుండా నియంత్రణ రేఖ (మార్క్) ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.