గాంధీ ఆస్పత్రిలో కలకలం

ABN , First Publish Date - 2020-04-07T09:41:20+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో కలకలం చోటు చేసుకుంది. కరోనా రోగి ఒకరు కనిపించడం లేదని ప్రచారం జరగడంతో అందరూ ఉలికిపడ్డారు. దీంతో అటు అధికారులు.. ఇటు పోలీసులు గంటల తరబడి ఆస్పత్రిని

గాంధీ ఆస్పత్రిలో కలకలం

  • కరోనా రోగి కనిపించట్లేదని ప్రచారం..
  • అధికారుల హైరానా

అడ్డగుట్ట/హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో కలకలం చోటు చేసుకుంది. కరోనా రోగి ఒకరు కనిపించడం లేదని ప్రచారం జరగడంతో అందరూ ఉలికిపడ్డారు. దీంతో అటు అధికారులు.. ఇటు పోలీసులు గంటల తరబడి ఆస్పత్రిని జల్లెడ పట్టారు. చివరకు అతడు ఆస్పత్రిలోని మరో అంతస్తులో నిద్రపోతున్నాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అతడు కరోనా పాజిటివ్‌ రోగి కాదని, ఎక్కడికీ తప్పించుకొని పోలేదని ఆస్పత్రి అధికారులు, పోలీసులు స్పష్టం చేశారు. గద్వాల (దేవులాంబ)కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల మర్కజ్‌కు వెళ్లి వచ్చాడు. అతడిని ఈ నెల 2న గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. దీంతో అతని ఇంటికి తిరిగి పంపించారు. అయితే, గద్వాల్‌లో అతనితోపాటు వెళ్లిన అందరికీ పాజిటివ్‌ రిపోర్టు రావడంతో అక్కడి అధికార యంత్రాంగం మరోసారి అతడిని గాంధీకి తరలించింది. అతడికి 6వ అంతస్తులో ప్రత్యేకంగా పడక ఏర్పాటు చేయించారు. అయితే, తనను ఇంటికి పంపించాలంటూ ఆదివారం రాత్రి ఆస్పత్రి సిబ్బందితో గొడవపడిన అతడు.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో 5వ అంతస్తుకు వెళ్లి మరో పడకపై నిద్రపోయాడు. అతడు కనిపించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం బయటకు రావడంతో కలకలం రేగింది. 5వ అంతస్తులోని పడకపై అతడు ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2020-04-07T09:41:20+05:30 IST