పారిశుధ్యంపై దృష్టి పెట్టండి
ABN , First Publish Date - 2020-03-25T09:33:32+05:30 IST
సిబ్బంది, వైద్యాధికారులతో సమన్వయం చేసుకుని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ అధికారులకు సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో రోడ్లన్నీ ఖాళీ అవుతున్నందున..

రోడ్లన్నీ ఖాళీ.. మరమ్మతులు చేపట్టండి
రూ.5 భోజనం కొనసాగించండి
అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): సిబ్బంది, వైద్యాధికారులతో సమన్వయం చేసుకుని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ అధికారులకు సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో రోడ్లన్నీ ఖాళీ అవుతున్నందున.. మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. జనం గుమిగూడకుండా చూస్తూ రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ కౌంటర్లను కొనసాగించాలని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన లేదా కరోనా లక్షణాలున్నవారితో సన్నిహితంగా మెలిగి, హోం క్వారంటైన్లో ఉన్నవారు ఇళ్లకే పరిమితమయ్యేలా నిఘా పెట్టాలని కలెక్టర్లను కోరారు. పారిశ్రామికవాడలు, ఐటీ పార్కుల్లో నిరంతరం పారిశుధ్య పనులను కొనసాగించాలని అదేశించారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను కరోనా నియంత్రణకు వాడుకునేలా ఐటీ, పరిశ్రమల శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో అత్యవసర సేవలు, వివిధ రంగాల సిబ్బంది విషయంలో పోలీసులు సానుకూలంగా వ్యవహరించేలా స్పష్టమైన సూచనలు ఇవ్వాలని హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డిలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.