తొలి కరోనా రోగి ప్లాస్మా దానం
ABN , First Publish Date - 2020-05-17T08:26:22+05:30 IST
కరోనా వైర్సతో బాధపడుతున్న రోగులకు ప్లాస్మా థెరపీ కోసం తమ వంతు సహకారం అందించడానికి మరో ఇద్దరు యువకులు ముందుకొచ్చారు. దీంతో ప్లాస్మా దానం చేసిన వారి సంఖ్య నాలుగుకి చేరింది.

సేకరించిన గాంధీ వైద్యులు.. నాలుగుకు చేరిన దాతలు
హైదరాబాద్ సిటీ, మే 16(ఆంధ్రజ్యోతి): కరోనా వైర్సతో బాధపడుతున్న రోగులకు ప్లాస్మా థెరపీ కోసం తమ వంతు సహకారం అందించడానికి మరో ఇద్దరు యువకులు ముందుకొచ్చారు. దీంతో ప్లాస్మా దానం చేసిన వారి సంఖ్య నాలుగుకి చేరింది. ఇంతకు ముందు ఓ లాయర్, ఓ చెఫ్ ప్లాస్మాను దానం చేశారు. తాజాగా తెలంగాణలో కరోనా వైరస్ సోకిన తొలి వ్యక్తి గంపా రాంతేజ శనివారం ప్లాస్మా దానం చేశారు. గాంధీవైద్యులు ఆయన రక్తాన్ని సేకరించి ప్లాస్మాను వేరుచేశారు. దానిని రక్తనిధి కేంద్రంలో భద్రపరిచారు. రాంతేజతో పాటు సికింద్రాబాద్కు చెందిన మరో వ్యక్తి కూడా ప్లాస్మాను ఇచ్చి స్ఫూర్తిగా నిలిచారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్కు చెందిన గంపా రాంతేజ బెంగళూరులో ఓ సంస్థలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగ రీత్యా ఆయన దుబాయికి వెళ్లి వచ్చిన తర్వాత కరోనా లక్షణాలు బయటపడ్డాయి. మార్చి 2న పాజిటివ్గా తేలడంతో తొలుత సికింద్రాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో.. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. తెలంగాణలో కరోనా వైర్సను జయించిన తొలి వ్యక్తి కావడంతో ప్రధాని మోదీ మన్కీబాత్ కార్యక్రమంలో రాంతేజ్తో ముచ్చటించారు. ఆయన అనుభవాలు తెలుసుకున్నారు.