ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.. భారీగా ఫైన్ పడింది..!

ABN , First Publish Date - 2020-10-03T15:21:53+05:30 IST

టీవీ రిపేర్‌ చేయకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన సంస్థల తీరును వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది. దీనిని సేవా లోపంగా పరిగణిస్తూ టీవీ డబ్బు తిరిగి

ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.. భారీగా ఫైన్ పడింది..!

హైదరాబాద్‌ : టీవీ రిపేర్‌ చేయకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన సంస్థల తీరును వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది. దీనిని సేవా లోపంగా పరిగణిస్తూ టీవీ డబ్బు తిరిగి చెల్లించడంతోపాటు అలసత్వం ప్రదర్శించినందుకు రూ.10 వేలు పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. మోతీనగర్‌ ప్రాంతానికి చెందిన పి.నాగేశ్వర్‌రావు రిటైర్డ్‌ ఉద్యోగి. పంజాగుట్ట తిరుపతి ఎలక్ట్రానిక్స్‌లో 2016 నవంబర్‌ 16న రూ.34,600 చెల్లించి వీడియోకాన్‌ టీవీ కొన్నారు. కొనుగోలు సమయంలో మూడేళ్ల వారంటీ ఇచ్చింది. 2019 మే 8న టీవీ పనిచేయడం లేదు. తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ సంస్థను సంప్రదిస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయమని చెప్పారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేస్తే టెక్నీషియన్‌ వచ్చి టీవీ చూసి డిస్‌ప్లే యూనిట్‌ పోయిందని చెప్పాడు. స్పేర్‌పార్ట్‌ కోసం హెడ్డాఫీసును సంప్రదిస్తామని, పార్ట్‌ రాగానే తెచ్చి రిపేర్‌ చేస్తామని చెప్పాడు. అప్పటి నుంచి నాగేశ్వర్‌రావు పలుమార్లు మెయిల్‌లో సంప్రదించారు. వీడియోకాన్‌ సంస్థ ప్రతినిధులు 2019 అక్టోబర్‌ 25న స్పేర్‌ పార్ట్‌ను మీ ఏరియా సర్వీస్‌ సెంటర్‌కు పంపామని, త్వరలో టెక్నీషియన్‌ వచ్చి రిపేర్‌ చేస్తాడని మెయిల్‌ పెట్టారు. నెలరోజులైనా ఎవరూ వచ్చి టీవీ రిపేర్‌ చేయలేదు. దీంతో బాధితుడు పరిహారంగా రూ.60 వేలు చెల్లించాలంటూ వీడియోకాన్‌ సంస్థతోపాటు టీవీ విక్రయించిన తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ను ప్రతివాదులుగా చేర్చుతూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. విచారించిన జిల్లా వినియోగదారుల ఫోరం-2 సేవ లోపం జరిగినట్లు గుర్తించింది. పరిహారంగా రెండు సంస్థలు కలిపి టీవీ కొనేందుకు వెచ్చించిన మొత్తం రూ.34,600 చెల్లించాలని, రిపేర్‌ చేయడంలో అలసత్వం ప్రదర్శించి వినియోగదారుడికి మనస్తాపం కలిగించినందుకు రూ.10 వేలు పరిహారంతోపాటు కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5 వేలు 45రోజుల్లో చెల్లించాలని తీర్పు చెప్పింది.

Updated Date - 2020-10-03T15:21:53+05:30 IST