అన్నదాతల ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-03T07:56:22+05:30 IST

రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక

అన్నదాతల ఆగ్రహం

 సమస్యల పరిష్కరించాలని నిజామాబాద్‌, 

నాగర్‌ కర్నూలు, కామారెడ్డి జిల్లాల్లో ఆందోళనలు  

హైదరాబాద్‌/నిజామాబాద్‌ అర్బన్‌ /రాజంపేట/కల్వకుర్తి అర్బన్‌, డిసెంబరు 2: రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని  ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతాంగం పట్ల మోదీ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని ఏఐకేఎంఎస్‌ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య మండిపడ్డారు. పత్తి కొనుగోలు చేయాలని నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గేట్‌ సమీపంలోని కల్వకుర్తి దేవరకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. గణేష్‌ జిన్నింగ్‌ మిల్‌లోని సీసీఐ కేంద్రం లో వెంటనే పత్తి కొనుగోలు  ప్రార ంభించాలని ఆందోళన చేశారు.


అలాగే, మక్కలను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి జిల్లా  ఆర్గొండలో రైతులు సెల్‌ టవర్‌ ఎక్కారు. కొనుగోలు చేసేలా చూస్తామని ఉన్నతాధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటంపై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా నిరవధికంగా ఆందోళనలు చేపట్టాలని రైతు సంఘం  రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.

హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో జంగారెడ్డి అధ్యక్షతన  బుధవారం  జరిగిన సమావేశంలో అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ తదితరులు ప్రసంగించారు. అఖిల భారత కిసాన్‌ సభ పిలుపు మేరకు ఈ నెల 3న  జిల్లా, మండల కేంద్రాల్లో జరిగే రాస్తారోకోలను జయప్రదం చేయాలని తీర్మానించారు. 


Updated Date - 2020-12-03T07:56:22+05:30 IST