రైతులకు ఇబ్బందులు రానివ్వం
ABN , First Publish Date - 2020-04-25T09:10:37+05:30 IST
ధాన్యం, మక్కల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి

సమీక్షలో మంత్రి సత్యవతిరాథోడ్
హాజరైన జడ్పీ చైర్పర్సన్, ఎంపీ, ఎమ్మెల్యే
మహబూబాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం, మక్కల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, కలెక్టర్ గౌతమ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల పనితీరును జిల్లా అదనపు కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు వివరించారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. జిల్లాలో 165 ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేపట్టామని తెలిపారు. 90 సెంటర్లలో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయన్నారు.
అదేవిధంగా మక్కల కోసం 100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 95 కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని పెద్దపల్లిలోని రైస్ మిల్లులకు, మక్కలను బీబీ నగర్కు తరలిస్తున్నామని తెలిపారు. ధాన్యానికి గన్నీ సంచుల కొరత లేదని, మక్కలకు మాత్రమే ఉందని తెలిపారు. రైతులు తమ దగ్గర ఉన్న గన్నీ సంచులను తీసుకువచ్చినట్లయితే ఒక్కొక్క సంచికి రూ.24.50 చొప్పున చెల్లిస్తామన్నారు.
అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండ ముందస్తుగా ప్రభుత్వం కొన్ని టార్పాలిన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. మార్క్ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, డీసీవో ఇందిరా, మార్కెటింగ్ అధికారి సురేఖ పాల్గొన్నారు. తొలుత ప్రజాప్రతినిధులు, అధికారులకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు.