నారాయణపురంలో రైతుల ధర్నా

ABN , First Publish Date - 2020-12-29T03:54:01+05:30 IST

నారాయణపురంలో రైతుల ధర్నా

నారాయణపురంలో రైతుల ధర్నా

కేసముద్రం, డిసెంబరు 28 : మండలంలోని నారాయణపురంలో 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 1827 ఎకరాలకు పట్టాదారు పాస్‌పుస్తకాలివ్వాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహించేందుకు రైతులు బయలు దేరగా సోమవారం గ్రామంలోనే పోలీసులు అడ్డుకున్నారు. మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ రవికుమార్‌ తన బృందంతో గ్రామానికి చేరుకొని రైతులను నిలిపివేశారు. దీంతో రైతులు గ్రామంలోని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. కరోనా వ్యాప్తి నేపఽథ్యంలో జిల్లా కేంద్రానికి భారీ సంఖ్యలో జనం వెళ్లేందుకు వీలు లేదని సీఐ రైతులకు సూచించారు. దీంతో రైతులు శాంతించి ధర్నాను విరమించారు. పోలీసుల సూచనలతో కొంతమంది రైతులు మహబూబాబాద్‌ వెళ్లారు.

మహబూబాబాద్‌ టౌన్‌ : మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం కేసముద్రం మండలం నారాయణపురం రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. గ్రీవెన్స్‌సెల్‌ నేపథ్యంలో కలెక్టరేట్‌కు వస్తున్న ఆర్డీవో కొమురయ్య వాహనాన్ని లోనికి పోకుండా అడ్డుకున్నారు. రైతులను తమగోడు విన్పించి ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందించారు. రైతులు సారంగరెడ్డి, చుక్కారెడ్డి, ఎడెల్లి వెంకట్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-29T03:54:01+05:30 IST