ముసలమ్మగుట్ట వద్ద బూటకపు ఎదురుకాల్పులు
ABN , First Publish Date - 2020-10-21T09:27:08+05:30 IST
ములుగు జిల్లా మంగపేట మండలం ముసలమ్మగుట్ట వద్ద ఈ నెల 18న పోలీసులు చేసినవి బూటకపు ఎదురుకాల్పులని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

మావోయిస్టు పార్టీ ఆరోపణ
హైదరాబాద్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా మంగపేట మండలం ముసలమ్మగుట్ట వద్ద ఈ నెల 18న పోలీసులు చేసినవి బూటకపు ఎదురుకాల్పులని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. జయశంకర్-భూపాలపల్లి, మహబుబాబాద్, వరంగల్, పెద్దపల్లి(జేఎండబ్య్లూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో మంగళవారం ఒక ప్రకటన బయటకు వచ్చింది. ఈ ఘటనపై హక్కుల సంఘాలు నిజనిర్ధారణ చేసి, హైకోర్టు ద్వారా న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ఫార్మర్ల ద్వారా మణుగూర్ దళకమాండర్ సుధీర్, లక్మాలను పోలీ్సలు హత్య చేశారని పేర్కొన్నారు. సుధీర్ గత పదేళ్లుగా పార్టీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పౌరహక్కులను కాలరాస్తూ బూటకపు ఎన్కౌంటర్లను కొనసాగిస్తోందని విమర్శించారు. మావోయిస్టు పార్టీ ఎజెండాతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నిరంకుశపాలనను కొనసాగిస్తోందన్నారు. ముసలమ్మ గుట్ట వద్ద హత్యలకు పాల్పడిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.