మరో నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు
ABN , First Publish Date - 2020-06-01T08:38:07+05:30 IST
రాచకొండ ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం మరోమారు నకిలీ పత్తి విత్తనాల రాకెట్ను ఛేదించింది.
ముగ్గురు నిందితుల అరెస్టు
రూ.22 లక్షల విలువైన సామగ్రి స్వాధీనం
కొత్తపేట, మే 31 (ఆంధ్రజ్యోతి): రాచకొండ ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం మరోమారు నకిలీ పత్తి విత్తనాల రాకెట్ను ఛేదించింది. ఈనెల 30న సాయంత్రం ఎస్ఓటీ, వ్యవసాయశాఖ అధికారులు, హయత్నగర్ పోలీసులు సంయుక్తంగా బాచారం గ్రామంలోని గోదాంలో తనిఖీలు చేశారు. వనస్థలిపురం సాయినగర్ కాలనీకి చెందిన మల్లె దేవేందర్రెడ్డి (52), మల్లె వెంకట్రెడ్డి (20), నల్లగొండ మునుగోడు మండలం, చొల్లేడుకు చెందిన గోడల సాగర్రెడ్డి (30) లను అదుపులోకి తీసుకున్నారు. రూ.22 లక్షల విలువచేసే 1.5 టన్నుల నకిలీ విత్తనాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ముఠాలోని మరో ముగ్గురు నిందితులు మదనపల్లెకు చెందిన రమేష్, వనస్థలిపురం, మన్సూరాబాద్ సహారా స్టేట్స్ కు చెందిన అక్షర సీడ్స్ ఎండీ ప్రవీణకుమార్, ఆయన భార్య పద్మావతి పరారీలో ఉన్నారు. రాచకొండ ఎస్ఓటీ అదనపు డీసీపీ సురేందర్రెడ్డి ఈ కేసు వివరాలను ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గతవారం నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ టీం దాడి చేసి రూ.50 లక్షల విలువచేసే నకిలీ పత్తి విత్తనాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.