కాంగ్రెస్ ఒత్తిడికి ఫేస్బుక్ యాజమాన్యం లొంగిపోయింది: రాజాసింగ్
ABN , First Publish Date - 2020-09-03T23:57:39+05:30 IST
కాంగ్రెస్ ఒత్తిడికి ఫేస్బుక్ యాజమాన్యం లొంగిపోయిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తనపై గన్ గురి పెట్టిన కాంగ్రెస్.. బీజేపీని టార్గెట్ చేసిందన్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ఒత్తిడికి ఫేస్బుక్ యాజమాన్యం లొంగిపోయిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తనపై గన్ గురి పెట్టిన కాంగ్రెస్.. బీజేపీని టార్గెట్ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రోద్భలంతోనే తన ఫేస్బుక్ అకౌంట్ రద్దుచేశారని తెలిపారు. దేశద్రోహులు, రోహింగ్యాలు, ముస్లింలపై తన తీరు మారదని రాజాసింగ్ తేల్చిచెప్పారు. ఫేస్బుక్ కాకపోతే మరో వేదికపై తన అభిప్రాయాలు తెలియజేస్తానని ప్రకటించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ అకౌంట్లు కూడా క్లోజ్ చేయాలని కోరారు. తన ఫేస్బుక్ అకౌంట్ పునరుద్ధరించాలని కేంద్ర ఐటీ మంత్రికి లేఖ రాస్తానని తెలిపారు. తన పేరుతో ఉన్న అనధికారిక ఫేస్బుక్ పేజీలను తొలగించినందుకు రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు.
రాజాసింగ్పై ఫేస్బుక్ యాజమాన్యం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో ఫేస్బుక్ నియమాలను ఆయన పాటించలేదని ఫేస్బుక్ పేర్కొంది. ద్వేష పూరిత, వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో ఫేస్బుక్ విధించిన నియమావళిని ఆయన ఉల్లంఘించారని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు.‘‘వివాదాస్పద వ్యాఖ్యలు, హింసను ప్రేరేపించే వ్యాఖ్యల విషయంలో మా నియమావళిని ఎమ్మెల్యే ఉల్లంఘించారు. అందుకే ఎమ్మెల్యే రాజా సింగ్పై నిషేధం ప్రకటించాం’’ అని తెలిపారు.