వైద్య విద్య అడ్మిషన్‌ ప్రక్రియ గడువు పెంచండి

ABN , First Publish Date - 2020-12-29T07:58:34+05:30 IST

వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ డిసెంబరు 31తో ముగియనున్న నేపథ్యంలో.. మరో 15 రోజులు గడువు పొడిగించాలని జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కు కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ లేఖ

వైద్య విద్య అడ్మిషన్‌ ప్రక్రియ గడువు పెంచండి

జనవరి 15 వరకు అవకాశమివ్వండి 

ఎన్‌ఎంసీకి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ లేఖ 


హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ డిసెంబరు 31తో ముగియనున్న నేపథ్యంలో.. మరో 15 రోజులు గడువు పొడిగించాలని జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కు కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ లేఖ రాసింది. ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నెల 31 నాటికి వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేయాలని సుప్రీం కోర్టు స్పష్టంగా తీర్పునిచ్చింది. కరోనా కారణంగా నీట్‌ పరీక్ష వాయిదా పడటంతోపాటు ఫలితాలు ఆలస్యంగా రావడం, సర్టిఫికేట్లను ఫిజికల్‌ వెరిఫికేషన్‌కు బదులు ఆన్‌లైన్‌ ద్వారా చేయడం వంటి కారణాలతో అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఎంబీబీఎస్‌ ప్రవేశాల అడ్మిషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మంగళ, బుధవారాలతో పూర్తికానుంది. అయితే కొందరు విద్యార్థులు కళాశాలల్లో చేరి సీట్లను వదిలేయడం, ఏపీ విద్యార్థులూ ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం వంటి కారణాలతో కొన్ని సీట్లు మిగిలిపోయే అవకాశం ఉందని, వాటిని డిసెంబరు 31లోగా పూర్తి చేసే పరిస్థితి లేనందున మరికొన్ని రోజులు గడువు కావాలని హెల్త్‌ యూనివర్సిటీ.. ఎన్‌ఎంసీని కోరింది. కాగా జాతీయ మెడికల్‌ కమిషన్‌ కూడా ఇప్పటికే సుప్రీం కోర్టులో గడువు పెంపుపై పిటిషన్‌ వేసింది. జనవరి 15 వరకు అడ్మిషన్ల ప్రక్రియ గడువు పెంచాలని ఆ పిటిషన్‌లో కోరింది.

Updated Date - 2020-12-29T07:58:34+05:30 IST