అతి త్వరలో ఎన్నికలు
ABN , First Publish Date - 2020-11-13T08:42:46+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, డిసెంబరు తొలివారంలోనే జరుగనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. దీపావళి తర్వాత
దీపావళి తర్వాత ఎప్పుడైనా జీహెచ్ఎంసీ నోటిఫికేషన్
దుబ్బాక షాక్తో మారిన ఆలోచన.. డిసెంబరు తొలివారంలోనే
నేడు ఓటరు తుది జాబితా.. 21న పోలింగ్ కేంద్రాల జాబితా
ఆ లోపే నోటిఫికేషన్?.. పార్టీల ప్రతినిధులతో ఈసీ భేటీ
పారదర్శకంగా ఎన్నికలు.. పార్టీలు సహకరించాలి: పార్థసారఽథి
ఓటరు జాబితాపై అనుమానాలున్నాయి: విపక్షాలు
దీపావళి తర్వాత ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, డిసెంబరు తొలివారంలోనే జరుగనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. దీపావళి తర్వాత ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వెలువరించి 16 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని సర్కారు ఓ నిర్ణయానికొచ్చినట్లు ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు దుబ్బాక ఎన్నిక ‘ఫలితం’తో ప్రభుత్వ పెద్దల ఆలోచనలో స్పష్టమైన మార్పు వచ్చిందని అంటున్నారు. వాస్తవానికి 13వ తేదీ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడుతుందని వారం క్రితం ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. ఆ మరునాడే ఎన్నికల నిర్వహణకు సంబంధించి భిన్న ప్రచారం జరిగింది. ఇప్పట్లో ఎన్నికలు ఉండవని, జనవరి చివరివారం, లేదంటే ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని ఉన్నతస్థాయి వర్గాల నుంచి లీకులు వచ్చాయి.
అయితే దుబ్బాకలో అధికార టీఆర్ఎ్సకు వ్యతిరేకంగా ఫలితం రావడంతో సర్కారు ‘ప్రణాళిక’లో మార్పు వచ్చింది. ఇంకా ఆలస్యం చేస్తే దుబ్బాక ఫలితం ప్రభావం.. గ్రేటర్ ఎన్నికలపైనా పడుతుందని సర్కారులో పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తే దుబ్బాక ఫలితంపై సుదీర్ఘకాలం చర్చకు తావిచ్చినట్లు అవుతుందని, ప్రత్యర్థి పార్టీలకు.. ప్రత్యేకించి గెలుపు మజాలో ఉన్న బీజేపీకి జీఎహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు అవకాశమూ దొరుకుతుందని సర్కారులోని పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. వీటికి అవకాశం లేకుండా ఉండాలంటే వెంటనే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
పైగా హైదరాబాద్లో ప్రస్తుతం వరద బాధితులకు ఇంటికి రూ.10వేల చొప్పున సాయం అందిస్తుండటంతో అధికార పార్టీకి మేలు జరుగుతుందన్న భావన ఆ పార్టీ పెద్దల్లో వ్యక్తమవుతోంది. ఇలా అన్నీ విశ్లేషించుకొని అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం. ఓటరు తుది జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన అంశాలపై ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారఽథి గురువారం తన కార్యాలయంలో 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అన్ని పార్టీలు, అభ్యర్థులు తప్పక పాటించి, ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు.
ఫిబ్రవరి 10లోగా జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగియనుండటంతో ఈలోగా ఎన్నికలు జరపాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. శుక్రవారం ఓటరు తుది జాబితాను వెల్లడిస్తామని, 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటించి, 21న తుది జాబితాను జారీ చేస్తామని చెప్పారు. ఒక వార్డులో నివసించే ఓటర్లందరినీ ఆ వార్డులోనే చేర్చాలని, ఒక కుటుంబంలోని వారంతా ఒకే వార్డులో ఉండేలా చూస్తామన్నారు.
కాగా, సహజంగా ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాతనే షెడ్యూల్ను ప్రకటించడం రివాజు. కానీ, జనవరిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఇంకా కొన్నింటిని ఖరారు చేయకుండానే షెడ్యూల్ను ప్రకటించారు. ఇప్పుడు కూడా పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయడానికి ముందే షెడ్యూల్ వెలువడనుందా?అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్తో అసదుద్దీన్ భేటీ
కేసీఆర్తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ భేటీ అయ్యారు. దుబ్బాక ఫలితం నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యూహాలు ఎలా ఉండాలనేది చర్చించారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని నిలువరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అవసరమైన చోట రెండు పార్టీలూ పోటీ చేయాలని, ఒకరు గెలిచే అవకాశం ఉన్న చోట మరొకరు పోటీలో నిలవకూడదని రెండు పార్టీలూ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
బోగస్ ఓట్ల తంతు.. అసలు గల్లంతు
ఓటరు ముసాయిదా జాబితాలో దొర్లిన తప్పులపై పార్టీల ప్రతినిధులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల భారీగా ఓట్లు గల్లంతైనట్లు చెబుతున్నారు. దూద్బౌలిలో వందలాది బోగస్ ఉన్నట్లు తాము గుర్తించామని, ఈ మేరకు అధికారులకు ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్రెడ్డి పేర్కొన్నారు. బీసీలకు మరో 13 సీట్లు కేటాయించే వీలున్నందున.. ఈ మేరకు ప్రభుత్వానికి సూచించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.
ముసాయిదా ఓటరు జాబితాలో అనేక తప్పులున్నాయని, వాటిని సవరించాలని బీజేపీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎ్సఎస్ ప్రభాకర్ కోరారు. బీజేపీ సానుభూతిపరుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగించారని ఆరోపించారు. జీహెచ్ఎంసీతో సంబంధం లేని వారినే ప్రిసైడింగ్ అధికారులుగా నియమించాలని కోరారు. హడావుడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, అన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాలను ఇవ్వాలని టీడీపీ నేతలు సతీశ్ కుమార్, జ్యోత్స్న కోరారు.
అంతా 16 రోజుల్లోనే
సవరించిన చట్టం ప్రకారం గ్రేటర్ ఎన్నికల ప్రక్రియను 16 రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణకు వారం రోజుల సమయం ఉంటుంది. అనంతరం ప్రచారానికి వారం మాత్రమే సమయం ఉంటుంది. జనవరిలో జరిగిన డబీర్పుర ఉప ఎన్నికనూ 16 రోజుల్లోనే పూర్తిచేశారు. ఇప్పుడే అదే షెడ్యూల్తో ఎన్నికలను పూర్తిచేస్తారని ఎన్నికల విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు.
