వైభవంగా ముక్కోటి ఏకాదశి

ABN , First Publish Date - 2020-12-26T05:17:28+05:30 IST

వైభవంగా ముక్కోటి ఏకాదశి

వైభవంగా ముక్కోటి ఏకాదశి
జనగామ బాణాపురం వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేస్తున్న అర్చకులు

ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

జనగామ కల్చరల్‌, డిసెంబరు 25: జిల్లా వ్యాప్తంగా ముక్కోటి(వైకుంఠ) ఏకాదశి వేడుకలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బాణాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే స్వామివారి ని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రధానార్చకుడు కృష్ణమాచార్య సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి సువర్ణ పాదుకలను సమర్పించి భక్తులు మహదాశీర్వచనం పొందారు. పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గల శ్రీ సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చీటకోడూరు శ్రీ పంచకోసు రామలింగేశ్వరస్వామి దేవాలయంలో ఆలయ ప్రధానార్చకులు కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామివ్రతం నిర్వహించారు. అదేవిధంగా పాలకుర్తి సోమేశ్వరాలయం, స్టేషన్‌ఘన్‌పూర్‌ తిరుమల నాథస్వామి దేవాలయం, జీడికల్‌ శ్రీరామచంద్రస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చిలుపూర్‌ బుగులు వెంకటేశ్వర ఆలయంలో రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్‌ డీవీఆర్‌ శర్మ, ఈవో లక్ష్మీప్రసన్న ప్రత్యేక పూజలు చేశారు. 


Updated Date - 2020-12-26T05:17:28+05:30 IST