ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. 50 వేల ఉద్యోగాలా!
ABN , First Publish Date - 2020-12-15T07:59:51+05:30 IST
ఆరున్నర సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాలు చేపట్టలేని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున 50

బోల్తాకొట్టించడంలో కేసీఆర్ను మించినోళ్లు లేరు: డీకే అరుణ
మహబూబ్నగర్, డిసెంబరు 14: ఆరున్నర సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాలు చేపట్టలేని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ప్రజలను బోల్తా కొట్టించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను మించినవారులేరన్నారు.
సోమవారం మహబూబ్నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆరున్నరేళ్ళలో కాంట్రాక్ట్ ఉద్యోగాలతో కలిసి 39 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా 50 వేల ఉద్యోగాలిస్తానని చెప్పి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేసి లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
ఉద్యోగులకు ఆగస్టు 15 నాటికి పీఆర్సీ, జూన్ 2 నాటికి ఐఆర్ ఇస్తానని చెప్పి మోసం చేశారని, ఇప్పుడు ఎన్నికల కోసం ఉద్యోగాల ప్రకటన చేస్తున్నారని, విద్యావంతులైన ఉద్యోగులు, నిరుద్యోగులు కేసీఆర్ మోసాన్ని గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన తన మాటల చాతుర్యంతో ప్రజలను మోసం చేయడం అలవాటుగా చేసుకున్నారని ఆరోపించారు.