కరోనాపై పోరులో.. తెలుగు బిడ్డ

ABN , First Publish Date - 2020-11-22T09:32:51+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరుకు అమెరికాలోని తెలుగు శాస్త్రవేత్త, వరంగల్‌కు చెందిన డాక్టర్‌ కన్నెగంటి తిరుమలదేవి అస్త్రాలను సిద్ధం చేశారు.

కరోనాపై పోరులో.. తెలుగు బిడ్డ

‘సైటోకైన్‌ స్టార్మ్‌’కు అడ్డుకట్ట వేసే ఔషధాలు గుర్తించిన డాక్టర్‌ కన్నెగంటి తిరుమలదేవి

ఎలుకలపై ప్రయోగ పరీక్షల్లో సత్ఫలితాలు

పరిశోధక బృందంలో మరో ఐదుగురు భారతీయులు.. వారిలో ఇద్దరు తెలుగువారే


వాషింగ్టన్‌, నవంబరు 21 : కరోనా మహమ్మారిపై పోరుకు అమెరికాలోని తెలుగు శాస్త్రవేత్త, వరంగల్‌కు చెందిన డాక్టర్‌ కన్నెగంటి తిరుమలదేవి అస్త్రాలను సిద్ధం చేశారు. టెన్నెసీ రాష్ట్రంలోని సెయింట్‌ జూడ్‌ చిల్ర్డెన్స్‌ రిసెర్చ్‌ ఆస్పత్రి ఇమ్యునాలజీ విభాగం వైస్‌-చైర్‌ హోదాలో సేవలు అందిస్తున్న ఆమె నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ ఘనత సాధించింది. తీవ్ర ఇన్ఫెక్షన్‌ కలిగిన కరోనా రోగుల ప్రాణాలకు ముప్పును కొనితెస్తున్న ‘సైటోకైన్‌ స్టార్మ్‌’కు సంబంధించిన పలు కీలక అంశాలను వెలుగులోకి తేవడంలో తిరుమలదేవి అండ్‌ టీం విజయం సాధించింది. సైటోకైన్‌ స్టార్మ్‌ కారణంగా రోగుల్లో శరీర కణజలాలం ఎలా దెబ్బతింటోంది ? ఇన్‌ఫ్లమేషన్‌ ఎలా సంభవిస్తోంది ? అవయవాల వైఫల్యం ఎందుకు జరుగుతోంది ? అనే చిక్కు ప్రశ్నలకు ఎలుకలపై జరిపిన ప్రయోగ పరీక్షల్లో సమాధానాలను తెలుసుకున్నారు.


ఈ ముప్పు తీవ్రతను తగ్గించేందుకు ఉపయోగపడే పలు ఔషధాలను కూడా గుర్తించారు. ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ స్పందించి వైర్‌స/బ్యాక్టీరియాను ఎదుర్కొనేందుకు యాంటీబాడీలు, వివిధ రోగ నిరోధక కణాలను విడుదల చేయడం సహజ పరిణామమే. అయితే రోగ నిరోధక కణాలు ఇన్ఫెక్షన్‌ సోకిన ప్రదేశం, రోగకారక క్రిమికి సంబంధించిన సమాచారాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు విడుదల చేసే సిగ్నలింగ్‌ ప్రొటీన్లే సైటోకైన్లు.


రోగ నిరోధక కణాలు ఎన్నో రకాల సైటోకైన్లను విడుదల చేస్తుంటాయి. అయితే తిరుమలదేవి నేతృత్వంలోని పరిశోధక బృందం ప్రత్యేకించి.. కొవిడ్‌-19 రోగులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న టీఎన్‌ఎ్‌ఫ-ఆల్ఫా, ఐఎ్‌ఫఎన్‌-గామా అనే సైటోకైన్ల పనితీరుపై అధ్యయనం చేసింది. కాగా, డాక్టర్‌ కన్నెగంటి తిరుమలదేవి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 1972 అక్టోబరు 18న జన్మించారు. కాకతీయ యూనివర్సిటీలోనే డిగ్రీ (బీజెడ్‌సీ) పూర్తి చేశారు. ఆమె పరిశోధక బృందంలో తెలంగాణకు చెందిన బానోతు బాలాజీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్‌.కె.సుబ్బారావు మలిరెడ్డి, పరిమళ్‌ సమీర్‌ (మధ్యప్రదేశ్‌), బాలమురుగన్‌ సుందరం (తమిళనాడు), శ్రద్ధ తులాధర్‌ ఉన్నారు. 

Updated Date - 2020-11-22T09:32:51+05:30 IST