ఇక ఇంటింటికీ ఇంటర్నెట్
ABN , First Publish Date - 2020-12-15T08:44:12+05:30 IST
వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని 33 జిల్లాలు, 585 మండలాలు, 12,751 గ్రామ పంచాయతీల్లోని 83.5 లక్షల గృహాలకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

‘టీ-ఫైబర్’కు ‘రైట్ ఆఫ్ వే’ అనుమతి
2022 నాటికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టు పూర్తి
ఇళ్లు, ప్రభుత్వ భవనాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్
పీవోపీలకు భవనాలు ఇవ్వాలి: ఐటీ శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని 33 జిల్లాలు, 585 మండలాలు, 12,751 గ్రామ పంచాయతీల్లోని 83.5 లక్షల గృహాలకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రూ.2000 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు’కు ఆటంకాలు తొలగించే చర్యలు చేపట్టింది. ‘ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎ్ఫసీ)’ కోసం భూసంబంధిత ఇబ్బందులు తలెత్తకుండా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సోమవారం ‘రైట్ ఆఫ్ వే’ ఉత్తర్వులు జారీ చేశారు.
టెండర్లు పూర్తి చేసి కేబుల్ వేసే బాధ్యతను స్టెరిలైట్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఈసీఐఎల్కు ఎల్ అండ్ టీ అప్పగించింది. కేబుల్ను భూగర్భంలో, స్తంభాల ద్వారా వేస్తారు. రాష్ట్ర హెడ్క్వార్టర్స్ నుంచి జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు, గ్రామాలు, ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు కేబుల్ వేస్తారు. దీనికోసం ‘నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్’ను ఏర్పాటు చేశారు. పీఎల్బీ హెచ్డీఎ్ఫఈ(హై డెన్సిటీ పాలిఇథైలిన్) పైపుల ద్వారా ఓఎ్ఫసీని 38 వేల కిలోమీటర్ల పొడవున వేస్తారు.
18 వేల కిలో మీటర్ల మేర కేబుల్ను మిషన్ భగీరథ పైపులైను దారిలో, మిగిలిన 20 వేల కిలోమీటర్ల కేబుల్ను స్టేట్ హెడ్క్వార్టర్ నుంచి మండలాలు, గ్రామపంచాయతీలకు వేయనున్నారు. ఫైబర్ గ్రిడ్ రెండో దశ కింద 50 వేల కిలో మీటర్ల కేబుల్ను గ్రామ పంచాయతీల నుంచి గృహాలకు వేస్తారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు ప్రభుత్వం రైట్ ఆఫ్ వే అధికారాలు కల్పించింది.
పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే కేబుల్ వేసే వెసులుబాటును కార్పొరేషన్కు రైట్ ఆఫ్ వే కింద ప్రభుత్వం కల్పించింది. ఏరియల్ కేబుల్కు సంబంధించి విద్యుత్తు సంస్థలకు కూడా ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. విద్యుత్ సంస్థలకు చెందిన స్తంభాలు, సబ్స్టేషన్లను అనుమతి తీసుకోకుండానే వాడుకోవచ్చని ప్రకటించింది.
టీ-ఫైబర్ సంస్థ ఏర్పాటు చేసే ‘పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్(పీవోపీ)లకు డిస్కంలు అత్యంత ప్రాధాన్యంగా విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించింది. ఫైబర్ గ్రిడ్ నెట్వర్క్ పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాలయాలు స్థలాన్ని ఉచితంగా కేటాయించాలని స్పష్టం చేసింది.